
సాక్షి, నెల్లూరు: రాష్ట్రంలో వ్యవస్థలు కూటమి పాలనలో దారుణంగా విఫలమయ్యాయని, ఆధారాల్లేకుండానే మాజీ మంత్రి కాకాణి గోవర్దన్రెడ్డిని జైలుకు పంపించారని వైఎస్సార్సీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి(Sajjala Ramakrishna Reddy) అన్నారు. శనివారం నెల్లూరు జైల్లో కాకాణితో ములాఖత్ అయిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
‘‘వైఎస్సార్సీపీ నేతలపై వరుసపెట్టి తప్పుడు కేసులు పెట్టి భయపెట్టాలని చూస్తున్నారు. కల్పిత కథనాలు సృష్టించి.. ఆధారాలు లేకుండానే మాజీ మంత్రి కాకాణి మీద కేసులు పెట్టి జైలుకు పంపారు. ఇది పరాకాష్టకి చేరింది. అక్రమంగా అరెస్ట్ చేస్తే.. బయటకు వచ్చాక వాళ్లు మరింత రాటు తేలుతారు.
వైఎస్సార్సీపీలో ఉండే సీనియర్ నేతలను టార్గెట్ చేశారని మేం ముందే అనుకున్నాం. అయితే ఎంత అణగతొక్కాలని చూస్తే అంతే బలంగా వైఎస్సార్సీపీ పైకి లేస్తుంది. చంద్రబాబు(Chandrababu) దీనిని మొదలుపెట్టారు. కానీ, దీని పరిణామాలు భవిష్యత్తులో ఘోరంగా ఉండబోతున్నాయి. అన్నింటికీ సిద్ధపడే రాజకీయాల్లోకి వచ్చాం. దేనికైనా సిద్ధం.
రాష్ట్రంలో సిస్టమ్ ఫెయిల్ అయ్యింది. పబ్లిక్గానే బట్టల్లేకుండా డ్యాన్సులు వేయిస్తున్నారు. ఖాకీ డ్రెస్సు వేసుకున్న పోలీసులు.. తెనాలిలో ముగ్గురిని నడిరోడ్డుపై దారుణంగా కొట్టారు అని అన్నారాయన.

గతంలో చంద్రబాబును పక్కా ఆధారాలతో మా ప్రభుత్వం అరెస్ట్ చేసింది. ఆయనపై అనేక కేసులు ఉన్నాయి. లిక్కర్ కేసులో బెయిల్ మీద ఉన్న చంద్రబాబు.. మేనేజ్ చేసుకుంటూ వస్తున్నారు. వైఎస్ జగన్(YS Jagan) అనుకుని ఉంటే చంద్రబాబును మరోసారి జైలుకు పంపేవారు. చంద్రబాబుకి రాజకీయ ఉనికి లేకుండా చేయాలని రాష్ట్ర ప్రజలు సిద్దమయ్యారు. కూటమికి పాడె కట్టాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికైనా చంద్రబాబులో మార్పు వస్తే మేలు. రాకపోతే భవిష్యత్తు భయంకరంగా ఉంటుంది’’ అని హెచ్చరించారాయన.
ఇదీ చదవండి: కూటమివారి నవమోసాలు