
సాక్షి, విశాఖపట్నం: రాబోయే కాలంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ఉద్యమిస్తామని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల వైఎస్సార్సీపీ నేతల విస్తృతస్థాయి సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మండలిలో మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణపై చర్చించాలని పట్టుబట్టామని.. ప్రజా సంక్షేమమే తమ అజెండా అన్నారు. ప్రజా సంక్షేమంపై తాము రాజీపడేది లేదని స్పష్టం చేశారు.
‘‘మెడికల్ కాలేజీల ఏర్పాటు పేదవారి వైద్యానికి సంబంధించినది. మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణను దుర్మార్గమైన చర్యగా భావిస్తున్నాం. పేదవాడి ఆరోగ్య విషయంలో రాజీపడం. కూటమి ప్రభుత్వానికి జగన్ ఫోబియా పట్టుకుంది. ఇంకా ఎన్ని రోజులు జగన్ పేరు చెబుతూ బతుకుతారు. కురుపాంలో 39 మంది విద్యార్థులు పచ్చ కామెర్లతో బాధపడుతున్నారు. అందులో ఇద్దరూ మరణించారు. కూటమి ప్రభుత్వానికి పర్యవేక్షణ కొరవడింది.
..అశోక్ గజపతిరాజు జెనెటిక్ ప్రాబ్లంతో బాధపడుతున్నారు ఆయనకు అహం ఎక్కువ. సింహాచలంలో ఆరుగురు భక్తులు మరణిస్తే కనీసం అశోక్ గజపతి రాజు పరామర్శించారా? ఆయన గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నేరాలు, హత్యలు హత్యాచారాలు పెరిగిపోయాయి. మా హయాంలో ఎన్ని నేరాలు జరిగాయి, ఏడాదిన్నరగా కూటమి పాలనలో ఎన్ని జరిగాయో లెక్కేసుకోండి’’ అని బొత్స పేర్కొన్నారు.