చంద్రబాబు తీరుపై విష్ణువర్ధన్‌ రెడ్డి ఆగ్రహం

BJP Vishnu Vardhan Reddy Slams Chandrababu Over His Letter To PM Modi - Sakshi

సాక్షి, అమరావతి: “నీకు కుటుంబం, బంధాలు లేవు. మా హక్కులు కాలరాశారు. మా అభివృద్ధిని ఓర్వేకపోతున్నారు. నీ కంటే నేను ముందే సీఎం అయ్యాను. గుజరాత్‌ని ఏం అభివృద్ధి చేసావు? మీ రాష్ట్రం కంటే దక్షిణ భారత దేశంలో అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందాయి? మీకు మేము బానిసలం కాదు. మీరు పబ్లిసిటీ పీఎం. మీరు పనిచేసే పీఎం కాదు. మాకు పనిచేసే పీఎం కావాలి” ఇవన్నీ సందర్భానుసారంగా 2018 మర్చి నుండి 2019 ఏప్రిల్ మధ్య నాడు మీరు మాట్లాడిన మాటలు బాబు గారు. గుర్తుఉందా?’’ అని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీపై చంద్రబాబు చేసిన దిగజారుడు వ్యాఖలను ప్రజలు మర్చిపోలేదంటూ చురకలు అంటించారు. (ఎవరి ఫోన్‌నైనా ట్యాప్‌ చేసే అవసరం మాకు లేదు)

కాగా ఫోన్‌ ట్యాపింగ్‌ అంటూ సరికొత్త డ్రామాకు తెరతీసిన చంద్రబాబు.. ఎల్లో మీడియాను అడ్డుపెట్టుకుని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంపై బురదజల్లేందుకు ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ప్రభుత్వంపై అక్కసు వెళ్లగక్కుతూ ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఈ విషయంపై స్పందించిన విష్ణువర్ధన్‌ రెడ్డి ట్విటర్‌ వేదికగా చంద్రబాబు తీరును తూర్పారబట్టారు. గతంలో ప్రధాని మోదీ, బీజేపీపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు, ప్రస్తుత లేఖను పోల్చుతూ బాబు అవకాశవాద రాజకీయాన్ని ఎండగట్టారు. అదే విధంగా స్వప్రయోజనాల కోసం అమరావతిని, రైతులను రాష్ట్రాన్ని రావణకాష్టం చేసి రాజకీయ బలిపీఠం ఎక్కించిన విషయంలో బాబు చరిత్రలో నిలిచిపోతారంటూ ఘాటు విమర్శలు చేశారు.

ఈ మేరకు.. ‘‘ మన సాయుధ దళాలు నూతన విశ్వాసాన్ని పొందాయి. అంతర్గతంగా, ఉగ్రవాదులు మరియు ఉగ్రవాద శక్తుల నుండి వచ్చే ముప్పు తగ్గింది, దేశం వెలుపల సరిహద్దులు బలోపేతం చేయబడ్డాయి. ఇవి తాజా లేఖలో మీరు మోడీగారికి చేసిన భజన. ఎందుకీ మార్పు? మోడీకి గారికి బిజేపికి మతిమరుపు లేదు ! రాజకీయాల్లో మీరు, మీ పార్టీ అవసరానుగుణంగా భజన చేయడం మీకు మామూలే. 1998,1999 ,2004 ,2014, 2019 మీ నాయకత్వంలో మాకు చాలా రాజకీయ అనుభవం ఉంది. మీ స్వార్థప్రయోజనాలు, మీ కుటుంబ రాజకీయాల కోసం రాష్ట్ర అభివృద్ధిని తాకట్టు పెట్టి, నీ రాజకీయ అవసరాలకోసం మోడీ, బీజేపీని విమర్శించారు. రాష్ట్ర ప్రజలును, దేశ ప్రజలు క్షమించమని కోరండి’’అని విష్ణువర్ధన్‌ రెడ్డి చంద్రబాబు హితవు పలికారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top