ములాయం సింగ్‌ కుటుంబం అంటే బీజేపీకి భయం | Sakshi
Sakshi News home page

ములాయం సింగ్‌ కుటుంబం అంటే బీజేపీకి భయం

Published Mon, Apr 29 2024 8:12 PM

Bjp Is Scared Of Mulayam Family, Shivpal Yadav Claimed

దివంగత సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత ములాయం సింగ్ యాదవ్ కుటుంబాన్ని చూసి అధికార పార్టీ బీజేపీ భయపడుతోందని సమాజ్‌వాదీ పార్టీ నేత శివపాల్ యాదవ్ అన్నారు. బీజేపీ నేతలు ఎస్పీకి వ్యతిరేకంగా ఎంత ఎక్కువ మాట్లాడితే.. లోక్‌సభ ఎన్నికల్లో విజయం అదే స్థాయిలో ఉంటుందని తెలిపారు.

సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ తరుణంలో శివపాల్‌ యాదవ్‌ మీడియాతో మాట్లాడారు. మూడో దశ సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లోని మొత్తం 10 స్థానాల్లో ఎస్పీ, ఇండియా కూటమి అభ్యర్థులు విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు.

యూపీలో మొదటి రెండు దశల్లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో పేలవమైన ఓటింగ్‌పై శివపాల్ యాదవ్ మాట్లాడుతూ.. మా ఓటర్లు కూలీలు, రైతులు. వారు, ఎండని వేడిని పట్టించుకోరు. ఓటర్లు వారి ఓటు హక్కును ఉపయోగిస్తున్నారు. కానీ బీజేపీ ఓటర్లు బయటకు రావడం లేదు. అందుకే బీజేపీ నేతల్లో ఆందోళన నెలకొందని అన్నారు.  

శివపాల్ యాదవ్‌కు వృద్ధాప్యం వచ్చిందని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై ఎస్పీ నేత శివపాల్‌ యాదవ్‌ స్పందించారు. నేను రోజుకు 40 సమావేశాలు నిర్వహిస్తున్నాను. యోగి మాత్రం రోజుకు నాలుగైదు సమావేశాలకు మాత్రమే హాజరవుతున్నారని తెలిపారు.

యూపీలో 10లోక్‌సభ స్థానాలకు మే 7న మూడో దశ ఎన్నికల పోలింగ్‌ జరగనుంది. మెయిన్‌పురి, ఫిరోజాబాద్, సంభాల్, బుదౌన్  స్థానాలు ఉన్నాయి. ఈ దశలో ఓటింగ్‌కు వెళ్లే చాలా స్థానాలను ఎస్పీ కంచుకోటలుగా కొనసాగుతున్నాయి. 

Advertisement

తప్పక చదవండి

Advertisement