TS: బీజేపీ క్లియర్‌కట్ మెసేజ్.. పట్టు దొరికిందా?

BJP Focused Attract Strong Leaders In Telangana - Sakshi

తెలంగాణాలో హిందుత్వ కార్డు ద్వారా విస్తరించాలనేది బీజేపీ గేమ్‌ప్లాన్‌. హిందుత్వ విషయంలో దూకుడుగా ఉండే బండి సంజయ్‌కు పార్టీ బాధ్యతలు  ఇవ్వడం ద్వారా బీజేపీ ఇప్పటికే క్లియర్‌కట్ మెసేజ్ ఇచ్చేసింది. హైదరాబాద్‌పేరును భాగ్యనగర్‌గా మారుస్తామంటూ ఇప్పటికే పలుసార్లు ప్రకటించింది. చార్మినార్‌-భాగ్యలక్ష్మి అమ్మవారి మందిరం అంశాన్ని కూడా రాబోయే ఎన్నికల్లో చర్చకు పెట్టే అవకాశం ఉంది. ఎంఐఎంతో కేసీఆర్ దోస్తీని ముందు నుంచీ బీజేపీ టార్గెట్ చేస్తోంది. రజాకార్ల పార్టీతో కేసీఆర్‌ సంబంధాలంటూ కేసీఆర్‌ను యాంటీ హిందూగా బీజేపీ ప్రచారం చేస్తోంది.
చదవండి: కాంగ్రెస్‌లో ఏం జరుగుతోంది.. రేవంత్‌కు ఊహించని ఫోన్‌ కాల్‌!

ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా సైతం కేసీఆర్ సర్కారు స్టీరింగ్ ఓవైసీ చేతిలో ఉందని పదే పదే విమర్శిస్తున్నారు. హైదరాబాద్‌లోని చాలా ప్రాంతాల్లో ఉన్నటువంటి యాంటీ ఎంఐఎం సెంటిమెంట్‌ను క్యాష్ చేసుకోవడంలో ఇప్పటికే బీజేపీ ఒక అడుగు ముందుకు వేసింది. తమకంటూ బలమైన హిందుత్వ ఓటు బ్యాంక్‌ను ఏర్పాటు చేసుకోవడంతో పాటు... ప్రభుత్వ వ్యతిరేక శక్తులను కలుపుకోవాలనే ద్విముఖ వ్యూహంతో బీజేపీ ముందుకు పోతోంది. 

హైదరాబాద్‌లో నివసించే నార్త్ ఇండియన్స్ బీజేపీకి అండగా నిలబడే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో వీరి ఓటింగ్ ఎక్కువగా ఉంటుంది. వీరితో పాటు తెలంగాణాలో బ్రాహ్మణ, వైశ్య సామాజిక వర్గాల్లో బీజేపీకి మంచిపట్టుంది. ఇక రాష్ట్రంలో అత్యధికంగా ఉన్న బీసీ సామాజిక వర్గాన్ని తమ వైపు తిప్పుకోవాలని బీజేపీ చూస్తోంది. బండి సంజయ్‌ లాంటి బీసికి రాష్ట్ర పార్టీ పగ్గాలు ఇవ్వడం ద్వారా తమది బీసీల పార్టీ అని బీజేపీ మేసేజ్ ఇచ్చింది.

ఇప్పటికే ఓబీసీ వర్గానికి చెందిన మోదీ ప్రధానిగా ఉండటంతో.. సహజంగానే ఆ పార్టీకి తెలంగాణా బీసీల్లో పట్టుదొరికే అవకాశాలున్నాయి. అయితే తెలంగాణా రాజకీయ చరిత్ర చూస్తే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి బీసీలందరూ ఏకపక్షంగా ఒకే పార్టీకి ఓటువేసిన ఉదాహరణలు చాలా తక్కువ. స్థానిక రాజకీయ సమీకరణాలు, అభ్యర్ధులను బట్టి బీసీ కులాల ఓటింగ్ మారుతూ ఉంటుంది.

దీనికోసం బీజేపీ వివిధ సామాజిక వర్గాలకు చెందిన బలమైన బీసీ నాయకులను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. ఉత్తర తెలంగాణాలో బలమైన బీసీ సామాజికవర్గం అయిన మున్నూరు కాపులకు కమలం పార్టీలో కీలక పదవులున్నాయి. అధ్యక్షుడు బండి సంజయ్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్‌ లాంటి మున్నూరు కాపునేతలకు పార్టీలో మంచి గౌరవం దక్కింది. ఇక ఈటలను చేర్చుకోవడం ద్వారా ముదిరాజ్‌ ఓటుబ్యాంకు తమవైపే ఉందని బీజేపీ అంటోంది. 
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top