మమత బెనర్జీకి మరో ఎదురుదెబ్బ
క్రీడా శాఖ సహాయ మంత్రి పదవికి లక్ష్మీ రతన్ శుక్లా గుడ్బై
కోల్కతా : ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మమతా బెనర్జీకి ఎదురుదెబ్బల పరంపర కొనసాగుతూనే ఉంది. తాజాగా పశ్చిమ బెంగాల్ యువజన సేవలు, క్రీడా శాఖ సహాయ మంత్రి లక్ష్మీ రతన్ శుక్లా తన పదవికి రాజీనామా చేశారు. దీంతో మమత ప్రభుత్వం నుంచి ఇప్పటికి ముగ్గురు మంత్రులు రాజీనామా చేసినట్లయింది. మాజీ క్రికెటర్, బెంగాల్ రంజీ టీమ్ మాజీ కెప్టెనైన శుక్లా తాను రాజకీయాల నుంచి రిటైర్ కాదలచినట్లు రాజీనామా లేఖలో పేర్కొన్నారు. తన రాజీనామా లేఖను సీఎం మమతకు, గవర్నర్ జగ్దీప్కు పంపారు. హౌరా(నార్త్) నుంచి ఎంఎల్ఏగా ఎన్నికైన శుక్లా తన ఎంఎల్ఏ పదవికి మాత్రం రాజీనామా చేయలేదు.
మంత్రి పదవికి రాజీనామా చేసిన లక్ష్మీరతన్ శుక్లాను తమతో చేర్చుకునేందుకు బీజేపీ, కాంగ్రెస్ పోటీపడుతున్నాయి. టీఎంసీ కుప్పకూలుతోందని, పార్టీపై మమతకు నియంత్రణ లేదని కాంగ్రెస్ విమర్శించింది. తమ పార్టీలో ఎవరు చేరాలనుకున్నా తలుపులు తెరిచేఉంటాయని కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చెప్పారు. టీఎంసీ పతనం ఇంతటితో ఆగదని బీజేపీ ప్రతినిధి సమిక్ దుయ్యబట్టారు