బీసీ బంధు ఊసేది? ఏపీలో అంత ఇస్తుంటే.. తెలంగాణలో ఎందుకివ్వరు?

BC Welfare National President R Krishnaiah Allegations On BRS Govt - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఓవైపు ఏపీ సర్కార్‌ బీసీలకు మేలు చేస్తుంటే.. తెలంగాణ సర్కార్‌ తీరని అన్యాయం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యులు ఆర్‌ కృష్ణయ్య. అంతేకాదు బీసీలకు సాయం అందిస్తామని ప్రకటించిన బీఆర్‌ఎస్‌ సర్కార్‌ మాట తప్పిందని, తెలంగాణలో బీసీ సంక్షేమ మంత్రిత్వ శాఖను ఎత్తేసే కుట్ర జరుగుతోందని సంచలన ఆరోపణలు చేశారాయన. 

‘‘బీసీల్లో ఆరు కులాలకు మాత్రమే టీఎస్‌ సర్కార్‌ రూ. లక్ష సాయం అందిస్తోంది. గతంలో అనేక కులాలకు ఇస్తామని హామీ ఇచ్చింది. బీసీల్లో ఉన్న మిగతా 130 కులాలకు కూడా రూ. లక్ష సాయం అందించాలి’’ అని డిమాండ్‌ చేశారాయన. ఇక.. బీసీ బంధు ఇస్తామని రెండేళ్ల కిందట తెలంగాణ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇప్పటికీ ఆ హామీ నెరవేర్చలేదని అసంతృప్తి వ్యక్తం చేశారాయన. ధనిక రాష్ట్రం, మిగులు బడ్జెట్‌ఉన్న రాష్ట్రం కాబట్టి అందరికీ నిధులు ఇవ్వాలని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నారాయన. 

ఉన్నత చదువులు చదివే విద్యార్థులను ప్రభుత్వమే ఆదుకోవాలని గుర్తు చేస్తున్నారాయన. అలాగే ‘‘తెలంగాణలో కులాంతర పెళ్లి చేసుకున్న వాళ్లకు రూ.10 వేలు ఇస్తున్నారు. కానీ, ఏపీ ప్రభుత్వం ఏకంగా రూ.2 లక్షల ఆర్థిక సాయం అందిస్తోంది. తెలంగాణలో బీసీ సంక్షేమ శాఖ ఎత్తివేసే కుట్రజరుగుతోందని, సీఎం పేషీలో కూడా అదే విధంగా జరుగుతోందని’’ రాజ్యసభ సభ్యులు ఆర్‌ కృష్ణయ్య సంచలన ఆరోపణలు చేశారు. 
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top