ప్రజా ధనంతో కొడుకు పెళ్లా?.. ముకేష్‌ అంబానీపై రాహుల్‌ ధ్వజం | Ambani spent crores on wedding with People money: Rahul Gandhi in Haryana | Sakshi
Sakshi News home page

పెళ్లికి వేల కోట్ల ప్రజాధనం.. ముఖేష్‌ అంబానీపై రాహుల్‌ గాంధీ ధ్వజం

Oct 1 2024 5:06 PM | Updated on Oct 1 2024 7:27 PM

Ambani spent crores on wedding with People money: Rahul Gandhi in Haryana

చండీగఢ్‌: ప్రముఖ వ్యాపారవేత, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్‌ అంబానీపై కాంగ్రెస్‌ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తన కొడుకు అనంత్‌ అంబానీ పెళ్లి కోసం వేల కోట్లు విచ్చలవిడిగా ఖర్చు చేశాడని.. అదంతా దేశ ప్రజల నుంచి దోచిన సొమ్మేనని ఆరోపించారాయన.

హర్యానాలోని బహదూర్‌గఢ్‌లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో రాహుల్‌ గాంధీ పాల్గొని ప్రసంగించారు. అంబానీ తన కొడుకు పెళ్లికి వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశాడు కదా? అది ఎవరిది.. అదంతా మీ(ప్రజల) డబ్బు.. మీ పిల్లలకు మీరు పెళ్లిళ్లు చేయాలంటే అక్కడ.. మీ బ్యాంకు ఖాతాల్లో డబ్బు లేదు.. మీ పిల్లల పెళ్లిళ్లకు మీరు బ్యాంకు రుణం తీసుకోవాల్సిందే. కానీ దేశంలో 25 మంది(పలువురు పారిశ్రామికవేత్తలు) మాత్రం తమ వివాహాలు, వేడుకలు జరిపించేందుకు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసే వ్యవస్థను ప్రధాని నరేంద్ర మోదీ అభివృద్ధి చేశారు’ అని విమర్శలు గుప్పించారు.

రైతులు బ్యాంకుల్లో, వేరే వారి వద్ద నుంచి అప్పులు తీసుకుంటేనే తన కుటుంబంలో వివాహాలు జరిపించగలుగుతున్నారు. ప్రధాని మోదీ.. మీ  జేబులో నుంచి డబ్బులు తీసుకొని ఆ 25 మంది జేబుల్లోకి వేస్తున్నాడని మండిపడ్డారు. అలాగే కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేస్తూ.. భారత సైనికుల నుంచి పెన్షన్‌, క్యాంటీన్‌, అమరవీరుల హోదాను లక్కోవడానికి అగ్నిపథ్‌ వంటి పథకాలు తీసుకొచ్చారని దుయ్యబట్టారు.

 ఇదిలా ఉండగా.. వ్యవసాయం ప్రధాన వృత్తిగా సాగుతున్న హర్యానాలో అక్టోబర్‌ 5న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ముచ్చటగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీ పావులు కదుపుతోంది. అటు 10 సంవత్సరాల తర్వాత ఎలాగైనా అధికారంలోకి రావాలని కాంగ్రెస్‌ కృషి చేస్తోంది. అక్టోబర్‌ 8న వెలువడే ఫలితాలతో అటు రెండు పార్టీల భవితవ్యం తేలనుంది.

Advertisement
 
Advertisement
Advertisement