ఇళ్లపై కుళ్లు రాజకీయం ఆపండి | Adimulapu Suresh Fires On Janasena Party For Tidco Houses | Sakshi
Sakshi News home page

ఇళ్లపై కుళ్లు రాజకీయం ఆపండి

Nov 14 2022 4:30 AM | Updated on Nov 14 2022 4:30 AM

Adimulapu Suresh Fires On Janasena Party For Tidco Houses - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇళ్ల నిర్మాణాన్ని కూడా రాజకీయం చేయాలని చూసే ప్రతిపక్ష పార్టీలు తమ పద్ధతి మార్చుకోవాలని, లేకపోతే ప్రజలే తిరగబడి తరుముతారని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌ హెచ్చరించారు. టిడ్కో ఇళ్లపై రాద్ధాంతం చేస్తూ జనసేన పార్టీ చేపట్టిన కార్యక్రమంపై ఆదివారం ఓ ప్రకటనలో మంత్రి మండిపడ్డారు. మంగళగిరిలో టిడ్కో లబ్ధిదారులు జనసేన నేతలను నిలదీసి వెళ్లిపోవాలని చెప్పడమే అక్కడ అన్ని వసతులు సమకూరాయనడానికి నిదర్శనమన్నారు.

టిడ్కో ఇళ్లపై రాద్ధాంతం చేసి రాజకీయంగా పబ్బం గడుపుకోవాలని చూస్తే రాష్ట్రవ్యాప్తంగా లబ్ధిదారులు ఆ పార్టీ నేతలను తరిమికొడతారన్నారు. అన్ని వసతులతో రాష్ట్రంలో ఇప్పటికే 40,576 టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందించామని, డిసెంబర్‌ నాటికి మరో 1,10,672 ఇళ్లను పూర్తిచేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా 1,43,600 మంది లబ్ధిదారులకు 300 చ.అ. ఇంటిని కేవలం రూపాయికే తమ ప్రభుత్వం రిజిస్ట్రేషన్‌ చేయించి ఇస్తోందని తెలిపారు.

సకల వసతులతో సుందరంగా ఇళ్లను తీర్చిదిద్ది లబ్ధిదారులకు అందజేస్తుంటే, జనసేన తమ రాజకీయ ప్రయోజనాల కోసం దిగజారుడు చర్యలకు పాల్పడుతోందని, ఇప్పటికైనా కుళ్లు రాజకీయాలు ఆపాలని హితవుపలికారు.  

Advertisement
 
Advertisement
Advertisement