తల్లిడిల్లిన మనసు.. | - | Sakshi
Sakshi News home page

తల్లిడిల్లిన మనసు..

Sep 7 2026 3:08 AM | Updated on Sep 7 2026 3:08 AM

తల్లిడిల్లిన మనసు..

ఆర్టీసీ బస్సు ఢీకొని యువకుడి మృతి లబోదిబోమంటూ రోదించిన తల్లి కంటతడి పెట్టిన స్థానికులు

కొత్తవలస:

చిన్న కొడుకుపై ఆ తల్లి ఎన్నో ఆశలు పెట్టుకుంది. తనకు అండగా నిలుస్తాడని..వృద్ధాప్యంలో కంటికి రెప్పలా చూసుకుంటాడని భావించింది. కానీ విధి ఆ కుటుంబంపై పగబట్టినట్లు వ్యవహరించింది. ఆర్టీసీ బస్సు రూపంలో మృత్యువు కబళించడంతో ఆ తల్లి ఆశలన్నీ ఒక్కసారిగా ఆవిరయ్యాయి. నన్ను ఆదుకుంటావనుకుంటే,..ఒంటరిని చేసివెళ్లిపోయావా నాయనా అంటూ తల్లి కన్నీరుమున్నీరుగా విలపించిన తీరు అక్కడ ఉన్నవారిని కంటతడి పెట్టించింది. ఈ ఘటనకు సంబంధించి సీఐ విజయకుమార్‌, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

కొత్తవలస మండల కేంద్రంలో సంత మార్కెట్‌ ఎస్సీ కాలనీకి చెందిన బోని వెంకటేష్‌ (33) విశాఖపట్నంలో ఒక ప్రైవేట్‌ పాఠశాలకు చెందిన బస్సు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఆదివారం సెలవు కావడంతో తన స్కూటీపై కొత్తవలస నుంచి ఎస్‌.కోట వైపు వెళ్తుండగా దేవరాపల్లి నుంచి ఆర్‌కే బీచ్‌కు వెళ్లే సింహాచలం డిపోకు చెందిన సిటీ బస్సు అరకు–విశాఖ రోడ్డులో ఆర్‌టీసీ కాంప్లెక్స్‌ సమీపంలో నూకాలమ్మ గుడి వద్ద వెంకటేస్‌ స్కూటీని ఢీకొట్టింది. బస్సు డ్రైవర్‌ మితిమీ రిన వేగంతో వస్తూ స్కూటీని ఢీకొట్టడంతో వెంకటేష్‌ ఎగిరి పడిపోగా రోడ్డుకు తల బలంగా తగలడంతో తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాద వార్త తెలుసుకుని తల్లి కనకమ్మ, అన్న శంకర్‌లు అక్కడికి చేరుకుని లబోదిబోమంటూ రోదించారు. మృతదేహంపై తల్లి కనకమ్మ పడి రోదించడం చూపరులను కంటితడి పెట్టించింది. మృతుడికి అన్నయ్య శంకర్‌, ఓ సోదరి, తల్లి కనకమ్మ ఉన్నారు. సోదరు డు శంకర్‌కు సోదరికి వివాహాలు కాగా వెంకటేష్‌కు వివాహం కాలేదు. తల్లి దగ్గరే ఉంటున్నా డు. మృతుడి సోదరుడు శంకర్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు శవ పంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎస్‌.కోట సీహెచ్‌సీకి పోలీసులు తరలించారు. ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని బస్సును పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

కొడుకు వెంకటేష్‌

మృతదేహం వద్ద రోదిస్తున్న తల్లి కనకమ్మ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement