గరుగుబిల్లి: ఒడిశా రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలతో తోటపల్లి ప్రాజెక్టుకు నీటితాకిడి పెరిగింది. బుధవారం సాయంత్రం బ్యారేజీ వద్ద నీటి మట్టం 105 మీటర్లకు 104.05 మీటర్లుగా నమోదైంది. ప్రాజెక్టు మొత్తం నీటి సామర్థ్యం 2.534 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 1.932 టీఎంసీల నీటినిల్వ ఉంది. బ్యారేజీకి సగటున 8,191 క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. ఈ మేరకు మూడుగేట్లను ఎత్తి సగటున 10,008 క్యూసెక్కుల నీటిని నదిలోకి విడుదల చేస్తున్నా రు. పాత కుడికాలువ ద్వారా 106 క్యూసెక్కు లు, పాత ఎడమ కాలువ ద్వారా 414 క్యూసె క్కుల నీరు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు వద్ద నీటి పరిస్థితిని ఇంజినీరింగ్ అధికారులు పర్యవేక్షిస్తున్నారు.
సాక్షి, పార్వతీపురం మన్యం: జిల్లాలో అంగన్వాడీ పోస్టుల నియామకాలకు మరోసారి బ్రేక్ పడింది. పోస్టులకు ఎంపికై నట్లు పలువురు అభ్యర్థులకు ఐసీడీఎస్ అధికారులు ఫోన్చేసి చెప్పారు. గురువారం నియామక పత్రాలు అందజేస్తామని తెలిపారు. ఈలోగానే పలువురు ఎమ్మెల్యేల నుంచి అభ్యంతరం వ్యక్తం కావడంతో ఆ ప్రక్రియ వాయిదా పడింది. జిల్లాలోని వివిధ అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న 263 కార్యకర్తలు, సహాయకుల పోస్టుల భర్తీకి గత ఏప్రిల్ 23న ఐసీడీఎస్ అధికారులు నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం విదితమే. ప్రాజెక్టుల వారీగా మే నెలలో అభ్యర్థులకు మౌఖిక పరీక్షలు నిర్వహించారు. తాము చెప్పిన వారికే పోస్టులు ఇవ్వాలని ఎమ్మెల్యేలు పట్టుబట్టడంతో.. నెలలు గడిచినా నియామకాలు పూర్తి కాలేలేదు. చాలామందికి కనీస అర్హతలు లేకపోవడంతో కలెక్టర్ ప్రభాకరరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిసింది. తాజాగా సహాయకుల పోస్టులకు సంబంధించి ఎంపిక ప్రక్రియను పూర్తి చేసి, ఈ నెల 27న మంత్రి సంధ్యారాణి చేతుల మీదుగా ఎంపికై న వారికి నియామక పత్రాలు అందజేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆయా అభ్యర్థులకు ప్రాజెక్టుల వారీ ఫోన్ల ద్వారా ఐసీడీఎస్ అధికారులు సమాచారం అందించారు. కొన్నిచోట్ల తాము సూచించిన వారికి పోస్టులు రాకపోవడంతో టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆయా ఎమ్మెల్యేల దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిసింది. గరుగుబిల్లి మండలంలో ఇదే తరహాలో వివాదం జరిగినట్లు సమాచారం. తాము సూచించిన అభ్యర్థులకు కాక.. వేరే ఎవరికో పోస్టులు ఎలా ఇస్తారంటూ ఎమ్మెల్యేల నుంచి అభ్యంతరం వ్యక్తం కావడంతో.. గురువారం జరగాల్సిన నియామక పత్రాల పంపిణీ ప్రక్రియ వాయిదా వేశారు. దీంతో ఎంపికై న అభ్యర్థులు ఉసూరుమన్నారు.


