● ఆర్థిక లావాదేవీల కారణంగానే రామారావు హత్య
● సీఐ శ్రీనివాసరావు
నెల్లిమర్ల: మండలంలోని వల్లూరులో కలకలం రేపిన హత్య కేసును పోలీసులు 48 గంటల్లోనే ఛేదించారు. ఆర్థిక లావాదేవీలు, కుటుంబ కలహాల కారణంగా జరిగిన ఈ హత్య కేసులో ఇద్దరు నిందితులను నెల్లిమర్ల పోలీసులు అరెస్ట్ చేశారు. హత్య కేసు వివరాలను భోగాపురం సీఐ ఎన్. శ్రీనివాసరావు నెల్లిమర్ల పోలీస్స్టేషన్లో బుధవారం వెల్లడించారు. వివరాల్లోకి వెళితే.. ఈనెల 24వ తేదీ ఉదయం 11 గంటల సమయంలో నెల్లిమర్ల మండలం వల్లూరు గ్రామానికి చెందిన సిరిగుడి రామారావు తన అన్న సిరిగుడి అప్పలనారాయణను బాకీ ఉన్న ట్రాక్టర్ అద్దె ఆరు వేల రూపాయల విషయమై ప్రశ్నించాడు. ఈక్రమంలో ఇద్దరి మధ్య తీవ్ర వివాదం చెలరేగింది. ఇంతలో అక్కడే ఉన్న అప్పలనారాయణ కుమారుడు శ్రీను కలగజేసుకుని చిన్నాన్న రామారావు తలపై కర్రతో దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి కుమారుడు సిరిగుడి పవన్కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నెల్లిమర్ల పోలీసులు కేసు నమోదు చేయగా.. భోగాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ నిమ్మకాయల శ్రీనివాసరావు కేసు విచారణ బాధ్యతలను చేపట్టారు. ఇదిలా ఉంటే పెదతరిమి జంక్షన్ వద్ద నిందితులు సిరిగుడి అప్పలనారాయణ, అతని కుమారుడు శ్రీనులను బుధవారం సాయంత్రం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 48 గంటల్లోనే నిందితులను అదుపులోకి తీసుకున్న సీఐ ఎన్.శ్రీనివాసరావు, ఎస్సై జి. గోపాలరావు, సిబ్బందిని అభినందించారు.


