సాక్షి, పార్వతీపురం మన్యం: సాలూరు మండలం దత్తివలసలో టీడీపీ మహిళా నేత భూకబ్జాకు ప్రయ త్నిస్తున్నట్లు అందిన ఫిర్యాదు మేరకు ఎస్సీ కమిషన్ విచారణ చేపట్టింది. దత్తివలస గ్రామంలోని సర్వే నంబర్ 143–4లో మంత్రి ప్రధాన అనుచరులుగా చెప్పుకుంటున్న ఓ టీడీపీ మహిళా నేత కబ్జాకు పాల్పడుతున్నట్లు బాధితులు ఎప్పటి నుంచో అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. తహసీల్దార్కు, కలెక్టరేట్ పీజీఆర్ఎస్కు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో సామలపల్లి మోహన్రావు అనే వ్యక్తి ఎస్సీ కమిషన్ను ఆశ్రయించాడు. బారిక మాన్యం కింద ఆ భూమి తమకు వచ్చిందని, అందుకు సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయని ఫిర్యా దు లో పేర్కొన్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కె.ఎస్.జహవర్ ఆదేశాల మేరకు కమిషన్ సభ్యులు రావాడ సీతా రాం బుధవారం సాలూరు మండలం దత్తివలస గ్రామానికి చేరుకున్నారు. వివాద భూమిపై క్షేత్రస్థా యి పరిశీలన చేపట్టారు. సంబంధిత స్థలాన్ని ప్రత్యక్షంగా చూసి, ఫిర్యాదులో పేర్కొన్న అంశాలను పరిశీలించారు. అనంతరం సంబంధిత అధికారులతో మాట్లాడి, సమస్యకు సంబంధించిన వాస్తవ పరిస్థితులను పూర్తిగా పరిశీలించి, నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎస్సీ వర్గాల ప్రజలకు న్యాయం జరిగేలా, వారి సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కారానికి కృషి చేయడమే తమ లక్ష్యమని ఆయన తెలిపారు.


