సాక్షి, పార్వతీపురం మన్యం:
నేడే మువ్వన్నెల సంబరం. యావత్ భారతా వని గర్వపడే ఆనంద క్షణం. మూడు రంగుల జెండా రెపరెపలతో ఊరంతా దేశభక్తి పరిమళిస్తోంది. స్వాతంత్య్ర వేడుకల కోసం పల్లె నుంచి పట్నం వరకు ముస్తాబైంది. త్యాగధనుల స్ఫూర్తిని స్మరించుకుంటూ.. స్వేచ్ఛా భారతం శనివారం ఘనంగా స్వాతంత్య్ర సంబరాలు జరుపుకోనుంది. జిల్లా స్థాయిలో వేడుకలను నిర్వహించేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లనూ పూర్తి చేసింది. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జరగనున్న ఈ వేడుకల ఏర్పాట్లను కలెక్టర్ ఎన్.ప్రభాకర రెడ్డి శుక్రవారం స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన జాతీయ జెండా ఆవిష్కరణ వేదిక, పరేడ్ మైదానం, వీఐపీ లు, ప్రజల కోసం ఏర్పాటు చేసిన సీటింగ్ ప్రాంగణాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
జెండా ఆవిష్కరించనున్న మంత్రి
ఉదయం 9 గంటలకు రాష్ట్ర మంత్రి గుమ్మిడి సంధ్యారాణి జెండా ఆవిష్కరణచేస్తారు. గౌరవ వంద నం స్వీకారం, పోలీసు పరేడ్ పరిశీలన అనంతరం జిల్లా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. డాగ్ స్క్వాడ్, సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శన, వివిధ శాఖల ప్రగతి సూచికల శకట ప్రదర్శన అనంతరం విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందజేయనున్నారు.


