పార్వతీపురం: ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చిన అర్జీల పరిష్కారానికి అధికారులే నేరుగా అర్జీదారులతో మాట్లాడి నాణ్యమైన పరిష్కారం అందించాలని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్లో ఉప కలెక్టర్ బి.వెంకటరమణ, డీఆర్డీఏ పీడీ ప్రభావతితో కలిసి మొత్తం 70 వినతులను కలెక్టర్ స్వీకరించారు. వాటిలో 19 రెవెన్యూకు సంబంధించినవి కాగా 51 ఇతర శాఖలకు సంబంధించినవి ఉన్నాయి. ప్రతి అర్జీ వెనుక ఒక కుటుంబం ఆశలు ఉంటాయని గుర్తుంచుకుని, సాంకేతిక కారణాలతో కేసులను మూసివేయకుండా శాశ్వత పరిష్కారం చూపాలని కలెక్టర్ సూచించారు. ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో ధ్రువీకరించి ఫిర్యాదు దారు సంతృప్తి చెందిన తరువాతే పీజీఆర్ఎస్ పోర్టల్లో పరిష్కరించినట్లు నమోదు చేయాలని ఆదేశించారు. మండల స్థాయి అధికారుల పనితీరుపై జిల్లా అధికారులు నిరంతర పర్యవేక్షణ చేయాలని స్పష్టం చేశారు. విద్యుత్ వైర్ల సమస్య, గ్రామీణ రహదారుల మరమ్మతులు, తాగునీటి బోరు, అన్నదాత సుఖీభవ, దివ్యాంగుల పెన్షన్, భూ ఆక్రమణలు, వెబ్ల్యాండ్లో భూమి వివరాల మార్పు, పట్టాదారు పాస్పుస్తకాలు, భూ వివాదాలకు సంబంధించిన వినతులను స్వీకరించారు. కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు, పీజీఆర్ఎస్ నోడల్ అధికారులు పాల్గొన్నారు.
ప్రజా సమస్యలకు సత్వర పరిష్కారం: ఎస్పీ
పార్వతీపురం రూరల్: ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని సత్వరమే పరిష్కరించే ఉద్దేశంతో పార్వతీపురం మన్యం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి స్వయంగా పాల్గొని ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు కుటుంబ కలహాలు, భూవివాదాలు, ఆస్తి తగాదాలు, వేధింపులు, మోసాలు తదితర సమస్యలపై ఎస్పీకి విన్నవించారు. ఎస్పీ మాధవ్ రెడ్డి ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం సంబంధిత పోలీస్ అధికారులతో ఫోన్లో మాట్లాడి, చట్టపరిధిలో నిష్పక్షపాతంగా విచారణ జరిపి త్వరితగతిన పరి ష్కారం చూపాలని ఆదేశించారు. తీసుకున్న చర్యల నివేదికను జిల్లా కేంద్రానికి పంపాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మొత్తం 10 ఫిర్యాదులు అందాయి. డీసీఆర్బీ సీఐ జీఏవీ రమణ, ఎస్సై శిరీష తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఐటీడీఏ పీజీఆర్ఎస్కు 27 వినతులు
సీతంపేట: స్థానిక ఐటీడీఏలో ఏపీఓ జి.చిన్నబాబు ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంసోమవారం నిర్వహించగా మొత్తం 27 అర్జీలు వచ్చాయి. జలంత్రకోట, నువ్వాగడలకు బీటీ రోడ్డు నిర్మించాలని, అలాగే కమ్యూనిటీ హాల్స్ మంజూరు చేయాలని కోరారు. అంగన్వాడీ కేంద్రం నుంచి పోషకాహారం ఇప్పించాలని మనగకు చెందిన ఎం.గజపతి కోరారు. ఆయిల్ ఇంజిన్ మంజూరు చేయాలని కవిటికి చెందిన పెద్దింటి లక్ష్మి వినతి ఇచ్చారు. నల్లబొంతుకు గ్రావెల్ రోడ్డు నిర్మించాలని గ్రామస్తులు అర్జీ ఇచ్చారు.


