ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీలో అడుగడుగునా అవకతవకలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అర్హులైన నిరుద్యోగులకు తీరని అన్యాయం జరిగింది. దీనిపై ఇప్పటికే నిరుద్యోగ యువత, విద్యార్థు లు ఎక్కడికక్కడ నిరసనలు, ర్యాలీలు నిర్వహిస్తున్నారు. యువత ఆవేదనను ప్రభుత్వం దృష్టికి బలంగా తీసుకెళ్లేందుకు వైఎస్ జగన్మోహన్న్రెడ్డి పిలుపు మేరకు మన్యం జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేశాం. మా ప్రధాన డిమాండ్ ఒకటే.. ఈ మెగా స్కామ్పై తక్షణమే సీబీఐ దర్యాప్తు జరిపించాలి. అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేశ్ తక్షణమే రాజీనామా చేయాలి. ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే ఆగస్టు 6 నుంచి 9వ తేదీ వరకు ప్రతి నియోజకవర్గంలో యువతతో కలిసి రిలే నిరాహార దీక్షలు, 10న రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో భారీ ర్యాలీలు చేపడతాం. నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు మా పోరాటం ఆగదు.
– పీడిక రాజన్నదొర, మాజీ ఉప ముఖ్యమంత్రి
పార్వతీపురం రూరల్:
డీఎస్సీ–2025 ఉపాధ్యాయ నియామకాల్లో చోటు చేసుకున్న భారీ అవకతవకలపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని వైఎస్సార్సీపీ మన్యం జిల్లా ముఖ్య నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర, మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు, అరకు పార్లమెంట్ పరిశీలకులు చిన అప్పలనాయుడు శుక్రవారం కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. మెగా డీఎస్సీ పేరుతో ప్రభుత్వం నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లిందన్నారు. నిబంధనలకు తిలోదకాలిచ్చి, అర్హతలేని వారికి క్రీడా కోటా కింద ఉద్యోగాలు కట్టబెట్టారని ఆరోపించారు. అత్యంత గోప్యంగా ఉండాల్సిన ప్రశ్నపత్రాల తయారీని ఔట్ సోర్సింగ్ సిబ్బందికి అప్పగించి లీకేజీకి పునాది వేశారని ధ్వజమెత్తారు. వ్యవస్థలో పని చేసిన వారికే టాప్ ర్యాంకులు రావడం దీనికి నిదర్శనమన్నారు. ఈ కుంభకోణానికి నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేశ్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యాదీవెన, వసతిదీవెన పథకాలను గాలికొదిలేసిందని విమర్శించారు. దాదాపు రూ. 9,500 కోట్ల బకాయిలు పేరుకుపోవడంతో, ఫీజు లు కట్టలేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ఆ నిధుల ను విడుదల చేయాలని కోరారు. ఎన్నికల ముందు సూపర్ సిక్స్లో భాగంగా నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల భృతి ఇస్తామని హామీ ఇచ్చిన కూటమి నేతలు.. నేటికీ అమలు చేయకపోవడం దారుణమన్నారు. బకాయిలతో సహా నిరుద్యోగ భృతిని వెంటనే చెల్లించేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కలెక్టర్ను కోరారు. పార్టీ పలు అనుబంధ విభాగాల నాయకులు, యువజన విభాగం నాయకులు పాల్గొన్నారు.


