పార్వతీపురం: జిల్లాలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో విద్యార్థుల భద్రత, మౌలిక వసతులు, విద్యాప్రమాణాల మెరుగుదల విషయంలో ఎలాంటి రాజీపడవద్దని కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి అధికారులను ఆదేశించారు. ఏకలవ్య పాఠశాలల పనితీరు, విద్యార్థుల సంక్షేమంపై గురువారం నిర్వహించిన వర్చువల్ సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యార్థుల భద్రతకు అత్యంత ప్రాధాన్యమివ్వాలని, వసతిగృహం గదులు, అకడమిక్ బ్లాకుల్లో అవసరమైనచోట సేఫ్టీ గ్రిల్స్ ఏర్పాటు చేయాలన్నారు. పాఠశాలల్లో తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు రూ.20 లక్షలతో ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. విద్యా ప్రమాణాల మెరుగుదల కోసం సీబీఎస్ఈ అకడమిక్ క్యాలెండర్ను అమలు చేయాలని, కొత్తగా చేరిన విద్యార్థులకు బ్రిడ్జి కోర్సులు నిర్వహించి పాఠ్యాంశాలపై అవగాహన కల్పించాలని సూచించారు. విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు ప్రతినెలా ఉచిత వైద్యశిబిరాలు నిర్వహించాలన్నారు. వర్చువల్ సమీక్షలో ఐటీడీఏ పీఓ ఆర్.వైశాలి, గిరిజన సంక్షేమశాఖ అధికారులు పాల్గొన్నారు.


