చదురుగుడికి.. సిరుల తల్లి
విజయనగరం టౌన్:
మంగళవాయిద్యాలు.. భక్తుల జయజయ ధ్వానాలు.. సాంస్కృతిక ప్రదర్శనల నడుమ పైడితల్లి దేవరమహోత్సవం సోమవారం శోభాయమా నంగా సాగింది. రైల్వేస్టేషన్ వద్ద ఉన్న వనంగుడి నుంచి సిరులతల్లి చదురుగుడికి చేరుకున్నారు. ముందుగా వనంగుడి స్తపన మందిరంలో సాయంత్రం 4.30 గంటలకు అమ్మవారి ఉత్సవ విగ్రహానికి ఆలయ వేదపండితులు, భక్తులు, పూజారులు శా స్త్రోక్తంగా పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరణ చేశారు. సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు అమ్మవారి ఉత్సవ విగ్రహంతో ఆలయం చుట్టూ జై పైడిమాంబనామ స్మరణతో మూడుసార్లు ప్రదక్షణ చేశారు. అనంతరం అప్పటికే ఆలయం బయట సిద్ధంగా ఉంచిన ఉత్సవ రథంపై అమ్మవారిని ఆశీనులు చేసి హారతిచ్చారు. మంగళ వాయిద్యాలు, విచిత్ర వేషధారణలు, భక్తుల జయజయ ధ్వానాల నడుమ అమ్మ రథం ముందుకు కదిలింది.
దారిపొడవునా పూజలు
సిరులతల్లి వనంగుడి నుంచి చదురుగుడికి బయలుదేరిన వేళ... విద్యల నగరంలో ఆద్యంతం భక్తిభావం ఉప్పొంగింది. రైల్వేస్టేషన్ వద్ద నుంచి ప్రారంభమైన రథం.. గాడీఖానా, సీఎంఆర్ కూడలి, వైఎస్సార్ సర్కిల్, ఎన్సీఎస్, కన్యకాపరమేశ్వరి ఆలయం, గంటస్తంభం, మున్సిపల్ ఆఫీస్, కమ్మవీధి, తెలకలవీధి రామమందిరం మీదుగా హుకుంపేటకు చేరుకుంది. అక్కడ చదురు వద్ద ఉత్సవ విగ్రహాన్ని, పూజారి ఇంటివద్ద ఇత్తడి ఘటాలను పెట్టారు. రాత్రి 7 నుంచి 10 గంటల వరకూ భక్తులు దర్శించుకున్నారు. తాడేపల్లి గూడెం కళాకారులు ప్రదర్శించిన నవదుర్గలు, కాళికామాత వేషధారణలు భక్తిభావాన్ని పెంపొందించాయి. తప్పెటగుళ్లు, కోలాటం, భజనలు భక్తులను ఆకట్టుకున్నాయి. ఆలయ ఇన్చార్జి ఈఓ ప్రసాద్ కార్యక్రమాలను పర్యవేక్షించారు.
సంప్రదాయబద్ధంగా..
సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు ఇంటి వద్ద రాత్రి 7 గంటల సమయంలో అమ్మవారి ఘటాలకు హుకుంపేట ప్రజలు పసుపు, కుంకుమలతో పూజలు చేశారు. మొక్కుబడులు చెల్లించారు. ఈ ఏడాది సిరిమానోత్సవ పండగను అంగరంగ వైభవంగా నిర్వహించుకునేలా చూడాలని, ఎటువంటి అవాంతరాలు లేకుండా కాపాడాలంటూ పైడితల్లిని ప్రార్థించారు. హుకుంపేట నుంచి రాత్రి 10 గంటలకు ఘటాలతో ఊరేగింపు ప్రారంభమైంది. మండపం వీధి, శివాలయం మీదుగా సుమారు 2 గంటల ప్రాంతంలో ఊరేగింపు మూడులాంతర్లు వద్దనున్న చదురుగుడికి చేరుకుంది. అక్కడ ఆలయంలో ఘటాలు, అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఆలయంలో ఉంచారు. వేకువజామున 3 గంటల ప్రాంతంలో ఆలయ తలయారీ రామవరపు చినపైడి రాజు బృందం సాయంతో జంగిడి మీద దీపం పెట్టుకుని, చదురుగుడి నుంచి డప్పు వాయిద్యాలతో మంగళవీధి మీదుగా తలయారి, పూజారి, కొందరు భక్తులు చెరువు వద్దకు వెళ్లి అమ్మవారికి మనవి చెప్పారు. అక్కడి మట్టిని అమ్మవారి బొమ్మగా మలచి పసుపు, కుంకుమలతో పూజలు చేశారు. ఈ రోజు నుంచి అమ్మవారు చదురుగుడిలో దర్శనమిస్తారని సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు తెలిపారు.
శోభాయమానం.. పైడితల్లి దేవర మహోత్సవం
ఉత్సవ రథంపై ఊరేగిన అమ్మవారు
హుకుంపేటలో ఘటాలకు పసుపు, కుంకుమలతో అభిషేకాలు
అడుగడుగునా అమ్మకు పూజలు చేసిన భక్తజనం
చదురుగుడికి చేరిన సిరులతల్లి


