నరసరావుపేటటౌన్: జాతీయ, రాష్ట్ర, జిల్లా న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు శనివారం స్థానిక మండల న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ అదాలత్లో సివిల్, క్రిమినల్, ముందస్తు వ్యాజ్యాలు, బ్యాంకు, కుటుంబ సంబంధిత లావాదేవీలు, మోటార్ వాహన ప్రమాద కేసులు తదితర అన్ని రకాల కేసులను పరిష్కరించారు. మొత్తం 3,716 కేసులు రాజీ ద్వారా పరిష్కారమయ్యాయి. ఈ కేసుల్లో కక్షిదారులకు రూ. 3.38 లక్షల మేరకు ఆర్థికపరమైన లబ్ధి చేకూరింది. న్యాయాధికారులు బి.కిరణ్ కుమార్, జోత్స్నశ్రీలు రెండు బెంచ్లుగా ఏర్పడి కేసులను పరిష్కరించారు. ఈ అదాలత్లో న్యాయవాదులు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, కక్షిదారులు పాల్గొన్నారు.
నరసరావుపేట: కలెక్టరేట్లో సోమవారం నిర్వహించనున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్), రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సోమవారం వినాయక చవితి పర్వదినం కారణంగా ప్రభుత్వ సెలవు కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని అర్జీదారులు గమనించాలని కోరారు. ఎవరైనా తాము దాఖలు చేసిన అర్జీలు ఇంకా పరిష్కారం కాకపోయినా, తమ ఫిర్యాదులకు సంబంధించిన తాజా సమాచారం తెలుసుకోవాలనుకున్నా 1100 ఫోన్నంబర్కు కాల్ చేయవచ్చని జిల్లా కలెక్టర్ తెలిపారు.


