నరసరావుపేట: స్థానిక ఏరియా హాస్పిటల్లో రూ.1.25 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన అధునాతన ఇంటిగ్రేటెడ్ లేబరేటరీని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా శుక్రవారం వర్చువల్గా ప్రారంభించారు. స్థానికంగా దీనిలో పాల్గొన్న పలువురు నాయకులు, అధికారులు ల్యాబ్లోని పలు విభాగాలను రిబ్బన్ కట్చేసి ఆరంభించారు. ఈ ఆధునిక ఇంటిగ్రేటెడ్ ల్యాబ్ అందుబాటులోకి రావడంతో నరసరావుపేట పరిసర ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్య పరీక్షలు, ఆధునిక వైద్య సేవలు మరింత సులభంగా అందుబాటులోకి రానున్నాయి. ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలనే సంకల్పంతో గత ప్రభుత్వంలో చేపట్టిన ల్యాబ్ పనులు పూర్తయి ప్రజలకు ఇపుడు అందుబాటులోకి వచ్చింది. జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా, ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు, ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు, హాస్పిటల్ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు డాక్టర్ లక్కిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ నాగసరపు సుబ్బరాయగుప్తా, బులియన్ మర్చంట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కపలవాయి విజయకుమార్, జిల్లా ప్రభుత్వ వైద్యశాలల సమన్వయకర్త డాక్టర్ ప్రసూన, వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ సురేష్, ఆర్డీఓ కె.బాలకృష్ణ, కూటమి నాయకులు, డాక్టర్లు పాల్గొన్నారు.


