వైఎస్సార్ సీపీ నేతలపై అక్రమ కేసులు
పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా నేతలు
అంబటి రాంబాబు తలపెట్టిన
వినతి పాదయాత్ర వాయిదా
ఐక్య పోరాటానికి మూడు జిల్లాల
ముఖ్య నాయకుల నిర్ణయం
గుంటూరు ఎడ్యుకేషన్: చంద్రబాబు ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్న తీరుపై వైఎస్సార్ సీపీ ఉమ్మడి గుంటూరు జిల్లా నేతలు మండిపడ్డారు. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు మెగా డీఎస్సీ స్కాంపై జూలై 31 నుంచి ఆగస్టు 10వ తేదీ వరకు నిరసన కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు చర్యలు చేపట్టాలని సమష్టిగా నిర్ణయించారు. గురువారం గుంటూరు నగరంలో సిద్ధార్థనగర్లోని మాజీ మంత్రి, పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు క్యాంపు కార్యాలయానికి తరలివచ్చిన ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు ఈ నిరసన కార్యక్రమాలపై చర్చించారు. శుక్రవారం డీఎస్సీ స్కాంపై జిల్లా కలెక్టర్లకు విజ్ఞాపన పత్రాలు సమర్పించనున్నారు. ఆగస్టు 3, 4 తేదీల్లో నియోజకవర్గ స్థాయిలో టౌన్ హాల్ సదస్సులు, ఆగస్టు 6 నుంచి 9వ తేదీ వరకు రిలే నిరాహారదీక్షలు, 10న నిరసన ర్యాలీలు నిర్వహించాలని పార్టీ విడుదల చేసిన షెడ్యూల్కు అనుగుణంగా సన్నద్ధం కావాలని నిర్ణయం తీసుకున్నారు. ఆయా కార్యక్రమాల్లో డీఎస్సీ బాధిత అభ్యర్థులు, విద్యార్థులు, నిరుద్యోగులను భాగస్వాములను చేయాలని పిలుపునిచ్చారు.
పోలీసులను వదిలే ప్రసక్తే లేదు
ప్రభుత్వ మాజీ విప్, మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ అంబటి ఇంటిపై టీడీపీ మూకల దాడి దుర్మార్గమని, ఎంపీ పెమ్మసాని ఆదేశాలతో ఈ దాడి జరిగిందన్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని ముఖ్య నేతలందరిపై అక్రమ కేసులు పెట్టారని తెలిపారు. టీడీపీ వారికి వత్తాసు పలుకుతున్న పోలీసులను వదిలే ప్రసక్తి లేదన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగంలో పెడుతున్న అక్రమ కేసులను 20 ఏళ్లలో ఎన్నడూ చూడలేదన్నారు. మాజీ ఎమ్మెల్యే ముస్తఫాపై పెట్టిన కేసు పూర్తిగా చట్ట విరుద్ధమన్నారు. అక్రమ కేసులకు భయపడబోమన్నారు.
రాజ్యమేలుతున్న అరాచకం
సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త గజ్జెల సుధీర్ భార్గవ్ రెడ్డి మాట్లాడుతూ కూటమి పాలనలో అరాచకం, అన్యాయం రాజ్యమేలుతున్నాయని ఆరోపించారు. పోలీసు యంత్రాంగం వైఫల్యంతో పాటు వ్యవస్థ పట్టాలు తప్పిందన్నారు. వైఎస్సార్ సీపీ నేతలతోపాటు అమాయకులపై తప్పుడు కేసులు పెడుతున్న ప్రభుత్వం, పోలీసులపై న్యాయ పోరాటం చేస్తామన్నారు.
కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్రెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మంగళగిరి, ప్రత్తిపాడు, వేమూరు, రేపల్లె, తెనాలి, గుంటూరు తూర్పు సమన్వయకర్తలు దొంతిరెడ్డి వేమారెడ్డి, బలసాని కిరణ్కుమార్, వరికూటి అశోక్బాబు, పీటా నాగమోహనకృష్ణ గౌతమ్రెడ్డి, తెనాలి శ్రావణ్కుమార్, నూరిఫాతిమా, వనమా బాలవజ్రబాబు, గుంటూరు పార్లమెంట్ పరిశీలకుడు పోతిన మహేష్, రాష్ట్ర ట్రేడ్ యూనియన్ విభాగ అధ్యక్షుడు గౌతంరెడ్డి, అసెంబ్లీ పరిశీలకులు నల్లమోతు రూత్రాణి, కాకుమాను సదాశివారెడ్డి, నిమ్మకాయల రాజనారాయణ, మదన్మోహన్ గౌడ్, నూతలపాటి హనుమయ్య, బాసు లింగారెడ్డి, చిట్టా విజయభాస్కర్రెడ్డి, కొమ్మినేని వెంకటేశ్వర్లు, గుత్తికొండ అంజిరెడ్డ, వై.మురళీధర్రెడ్డి, పడాల శివారెడ్డి, గడ్డేటి సురేంద్ర, మోపిదేవి శ్రీనివాసరావు, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


