నరసరావుపేట రూరల్: స్వాతంత్య్ర సమరయోధుడిగానే కాకుండా చేనేత కార్మికుల హక్కులు, సంక్షేమ కోసం నిరంతరం పోరాడిన మహనీయుడు ప్రగడ కోటయ్య అని జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) రోహిత్ కుమార్ చౌదరి తెలిపారు. చేనేత ఉద్యమ స్ఫూర్తి ప్రధాత ప్రగడ కోటయ్య జయంతిని జిల్లా పోలీసు కార్యాలయంలో ఆదివారం నిర్వహించారు. కోటయ్య చిత్రపటం వద్ద అదనపు ఎస్పీ రోహిత్ కుమార్ పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేనేత కార్మికుల సంక్షేమం కోసం ప్రగడ కోటయ్య జీవితాన్ని అంకిత చేసారని తెలిపారు. చేనేత రంగాన్ని దేశవ్యాప్తంగా అభివృద్ధి చేసేందుకు, కార్మికులకు గౌరవప్రదమైన జీవనోపాధి కల్పించేందుకు చిరస్మరణీయమైన కృషి చేసారని పేర్కొన్నారు.
కలెక్టరేట్లో ..
నరసరావుపేట: కలెక్టర్ కార్యాలయంలో చేనేత ఉద్యమ పితామహుడు ప్రగడ కోటయ్య జయంతి ఉత్సవాలు ఆదివారం నిర్వహించారు. జిల్లా పరిశ్రమల అధికారి జి.సురేష్ ఆధ్వర్యంలో అధికారులు, చేనేత నాయకులు కోటయ్య చిత్రపటానికి పూలు చల్లి నివాళులర్పించారు. ఫణిదం చేనేత సహకార సంఘం అధ్యక్షుడు కట్టా శివ దుర్గారావు సమక్షంలో జాతీయ చేనేత అవార్డు విజేత కర్నాటి మురళిని సత్కరించారు. చేనేత నాయకులు దండ కోటేశ్వరరావు, హ్యాండ్లూమ్, టెక్స్టైల్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఉమామహేశ్వరరావు, అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్ రాఘవరావు పాల్గొన్నారు.
వినుకొండ: పట్టణంలోని ఏడీబీ బ్యాంక్ రోడ్డు డ్రైనేజీలో ఓ వ్యక్తి మృతదేహం లభ్యం కావడం కలకలం రేపింది. మృతుడిని శృంగారపు వనానికి చెందిన నల్లగట్ల శేషాద్రిగా పోలీసులు గుర్తించారు. శేషాద్రి శరీరంపై ఎలాంటి గాయాలు లేవని పోలీసులు తెలిపారు. సీపీ టీవీ దృశ్యాలను పరిశీలించగా, ఉదయం 6:14 గంటల ప్రాంతంలో నిలబడి ఉన్న శేషాద్రి ఒక్కసారిగా కుప్పకూలి పక్కనే ఉన్న డ్రైనేజీలో పడిపోయినట్లు నమోదైంది. కిందపడిన తర్వాత ఆయనలో ఎలాంటి కదలిక లేదు. హఠాత్తుగా స్ట్రోక్, మూర్ఛ లేదా మద్యం మత్తు వల్ల పడిపోయి మృతి చెంది ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన అనంతరమే మృతికి గల పూర్తి కారణాలు తెలుస్తాయని పోలీసులు పేర్కొన్నారు.
ఈపూరు: మండలంలోని బొమ్మరాజుపల్లి కనుమ వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ఇద్దరికి గాయాలయ్యాయి. బొల్లాపల్లి మండలం జయంతిరామాపురం గ్రామానికి చెందిన కోసూరు శ్రీనివాసరావు(32), తోకల వెంకటేష్, చిన్నిలు ద్విచక్ర వాహనంపై ఈపూరు వైపు వస్తుండగా బొమ్మరాజపల్లి కనుమ వద్దకు రాగానే రోడ్డు పక్కనే ఉన్న ఫెన్సింగ్ స్తంభాన్ని వేగంగా ఢీకొట్టడంతో కోసూరు శ్రీనివాసరావు తలకు తీవ్ర గాయాలయ్యాయి. తోకల వెంకటేష్, చిన్నికు స్వల్ప గాయాలయ్యాయి. 108 అంబులెన్స్లో క్షతగాతులను వినుకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించగా కోసూరు శ్రీనివాసరావు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మిగిలిన ఇద్దరికీ చికిత్స అందిస్తున్నారు. పోలీసులు ప్రమాద స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.


