సత్తెనపల్లి: పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో శుక్రవారం నిర్వహించిన రుణమేళా సభకు ముఖ్యమంత్రి చంద్రబాబు రావడంతో బస్సు ప్రయాణికులకు చుక్కలు కనిపించాయి. సీఎంతోపాటు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కూడా కార్యక్రమానికి హాజరయ్యారు. చంద్రబాబు సభకు జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో జన సమీకరణ చేయడానికి ఆర్టీసీ బస్సులను కేటాయించారు. నరసరావుపేటలోని సభకు మొత్తం 600 బస్సులు కేటాయించడంతో ప్రయాణికులు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఎక్కడికక్కడ జిల్లాలోని ఏడు నియోజకవర్గాలకు ఆర్టీసీ బస్సులను కేటాయించి వాటిలో డ్వాక్రా మహిళలతోపాటు జనాన్ని సమీకరించారు. సీఎం చంద్రబాబు సభ పుణ్యమా అని ప్రయాణికులు, విద్యార్థులకు రోడ్లపై గంటల తరబడి పడిగాపులు తప్పలేదు. దీనికితోడు ఆషాఢ మాసంలోని శుక్రవారం కావడంతో మహిళలు పెద్ద ఎత్తున అమ్మవార్ల దేవాలయాలకు బయలుదేరారు. ఈ క్రమంలో జిల్లాలోని ఏ డిపోలో కూడా ఆర్టీసీ బస్సులు అందుబాటులో లేకపోవడంతో వారు కూడా తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించాల్సిన దుస్థితి ఏర్పడింది. ముఖ్యంగా వైద్యశాలలకు వెళ్లే రోగులు నానా అవస్ధలు పడ్డారు. ముఖ్యమంత్రి సభ సంగతి దేవుడెరుగు తమకు ఈ ఇబ్బందులు ఏమిటంటూ ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


