పల్నాడు అడ్డా.. జోరుగా పేకాట సాక్షి టాస్క్ఫోర్స్: పల్నాడు ప్రాంతాన్ని అడ్డాగా చేసుకొని పేకాట క్లబ్లు (జూద శిబిరాలు) నిర్వహించడంలో చిలకలూరిపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లోని టీడీపీకి చెందిన బడా నేతలు కీలకంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. నీ కింత .. నా కింత అని నేతలు వాటాలు వేసుకొని, స్థానిక టీడీపీ నేతలు సంపూర్ణ సహకారంతో జూదం నిర్వహిస్తున్నారు. పేకాట క్లబ్ల నిర్వహణ వెనుక టీడీపీ ముఖ్య నేతల హస్తం ఉండటంతో పేకాట క్లబ్లు విచ్చలవిడిగా సాగుతున్నా పట్టించుకునే పరిస్థితి లేదని జిల్లాలో చర్చ నడుస్తోంది. సీఎంఓ కార్యాలయం నుంచే అండదండలు ఉన్నాయని, టీడీపీ బడా నేతల ఆధ్వర్యంలో పేకాట క్లబ్లు నిర్వహిస్తున్నారనేది బహిరంగ రహస్యం.
ఈ పేకాట క్లబ్ల వెనుక టీడీపీ బడా నేతల హస్తం ఉండడంతో పోలీసు ఉన్నతాధికారులకు నోట్ల కట్టలు ఎరవేసినట్లు ప్రచారం. ఈ క్రమంలోనే పేకాట క్లబ్ల వైపు వెళ్లేందుకు స్థానిక పోలీసులు జంకే పరిస్థితి నెలకొంది. ప్రతి రోజు దాదాపు ఒక్కో క్లబ్కు 200 నుంచి 300 మందితో పేకాట ఆడిస్తున్నారు. ప్రతిరోజు రూ.75 లక్షల నుంచి రూ.90 లక్షల వరకు పేకాటను ఆడిస్తున్నారు. పేకాట కబ్బుల్లో టేబుల్ పై పేకముక్కలు పడగానే జూదర్ల చేతిలోని కరెన్సీ కట్టలు చిత్తు కాగితాల మాదిరి అవుతున్నాయి. ఒక్కో ఆటకు రూ.లక్షల్లో పందెం కాస్తున్నారంటే ఇక్కడ జూదం ఏ స్థాయిలో సాగుతుందో అర్థం చేసుకోవచ్చు. పేకాట క్లబ్లు ఉదయం నుంచి రాత్రి వరకు నిర్వహిస్తుండడం గమనార్హం. పల్నాడు, గుంటూరు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు జిల్లాలతో పాటు హైదరాబాద్ ప్రాంతాలకు చెందిన వ్యక్తులకు ఫోన్ల ద్వారా సమాచారం అందించి మరీ ఆడిస్తున్నట్లు సమాచారం. గతంలో సత్తెనపల్లిలో రెండుసార్లు పోలీసులు దాడులు చేసినప్పటికీ అసలైన నిర్వాహకులపై ఎటువంటి కేసులు పెట్టకపోవడం పోలీసులు తీరు పై అనేక విమర్శలు వెల్లువెత్తాయి.
పేకాట క్లబ్ల నిర్వాహకులు పోలీసులు దాడి చేసినా నగదు దొరక్కుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే పేకాటరాయుళ్ల వద్ద నగదు తీసుకొని రంగు రంగుల కాయిన్లను ఇస్తున్నట్లు తెలుస్తోంది. కలర్ ఆధారంగా కాయిన్లు సిద్ధం చేసి ఒక్కో రంగుకు ఒక్కో రేటు నిర్ణయించినట్లు సమాచారం. అందుకే పోలీసులు దాడి చేసిన సమయంలో పదుల సంఖ్యలో ఆటగాళ్లు పట్టుబడినా.. నగదు మాత్రం పెద్దగా ఉండదు. ఆట ముగిశాక కాయిన్లు నిర్వాహకులకు ఇస్తే అందుకు తగ్గ మొత్తం నేరుగా ఇస్తారు.లేదా బ్యాంకు ఖాతాకు జమ చేస్తున్నారు. ఆన్లైన్ నగదు లావాదేవీల తర్వాత క్యాష్ ఇచ్చేందుకు కొందరు కమిషన్ ఏజెంట్లు కూడా పేకాట క్లబ్ల పై ఆధారపడినట్లు తెలుస్తోంది.
నిమిషాల్లో బతుకులు తలకిందులు
ప్రస్తుతం పేకాట క్లబ్ల కారణంగా కొన్ని నిమిషాల వ్యవధిలోనే కొందరు రూ. లక్షలు పోగొట్టుకొని బతుకులను తలకిందులు చేసుకుంటున్నారు. సరికొత్త పేర్లతో సాగుతున్న ఈ జూదాటలో క్షణాల వ్యవధిలోనే రూ.లక్షలు చేతులు మారుతాయి. ఆడే వారికి ముందుగా డబ్బు వచ్చేలా మాయ చేస్తుండడంతో కొందరు ఈ మాయలో పడి ఈ క్లబ్ల వద్దకు వెళ్లి చేతులు కాల్చుకుంటున్నారంటున్నారు. పేకాట క్లబ్ల నిర్వహణలో రాటు తేలిన వ్యక్తులు ఈ క్లబ్ల నిర్వహణలో కీలకమని చెబుతున్నారు.
● టీడీపీ నాయకుల అండదండలతో
యథేచ్ఛగా పేకాట
● ఐదు జిల్లాల నుంచి వస్తున్న
పేకాటరాయుళ్లు
● చిలకలూరిపేట, సత్తెనపల్లిలో
పేకాట క్లబ్లు
● నోట్ల కట్టలతో పోలీసుల
కళ్లు మూయించినట్లు ఆరోపణలు
● నీకింత .. నాకింత అంటూ అధికార
పార్టీ నేతల వాటాల పంపకాలు
● రెండు నియోజకవర్గాల్లో
మండిపడుతున్న మహిళలు
రూ. లక్షల్లో నిర్వహణ...
కాయిన్లతోనే ‘లెక్క’ !