మైనార్టీ ఉద్యోగి మరణానికి కారణమైన
పిడుగురాళ్ల: సీఐ వేధింపులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడిన మైనార్టీ వర్గానికి చెందిన ఉద్యోగి షేక్ దరియా హుస్సేన్ కేసును నీరుగార్చేందుకు పోలీసులు యత్నిస్తున్నారని పల్నాడు జిల్లా గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి మండిపడ్డారు. గురువారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ‘ఆత్మహత్య చేసుకున్న దరియా హుస్సేన్ రాసిన సూసైడ్ లేఖ, మరణవాంగ్మూలం వీడియో ఉన్నాయి. ఇవి ఉంటే నేరుగా కేసు కట్టాలని న్యాయవ్యవస్థే చెబుతోంది. కానీ పిడుగురాళ్ల పోలీసులు ఇద్దరు వ్యక్తులపై కేసుకట్టి చేతులు దులుపుకోవటం దుర్మార్గం’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అతడి ఆత్మహత్యతో పోలీసులకు సంబంధం లేదని మీడియాకు చెప్పాలని, ఇదే విషయమై సంతకాలు పెట్టాలని పోలీసులు మృతుడి కుటుంబ సభ్యులపై ఒత్తిడి తెచ్చి బెదిరిస్తున్నారన్నారు. ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, ఉన్నతాధికారులు తమను పంపించారని భయపెడుతున్నారని చెప్పారు. చెప్పినట్టు వినకపోతే మీ బిడ్డలపై కేసులు నమోదు చేస్తామని తీవ్రమైన బెదిరింపులకు దిగడం దారుణమన్నారు. ఎమ్మెల్యే యరపతినేని చెబితేనే తాను చేస్తున్నానని, తనపై కేసులు పెడితే ఎవరు ఎవరు ఉన్నారో చెబుతానని సీఐ వెంకట్రావు బహిరంగంగా చెబుతున్నారని ఆరోపించారు. దరియా హుస్సేన్ కుటుంబానికి వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని, అతడి ఆత్మహత్యకు కారణమైన పోలీసులపై కేసులు కట్టే వరకు తమ పోరాటం ఆగదని చెప్పారు. ప్రభుత్వం హుస్సేన్ కుటుంబానికి రూ.కోటి నష్టపరిహారం, ఆ కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చేంత వరకు పోరాటం కొనసాగిస్తామన్నారు.


