బీడువారుతున్న సాగు భూములు
ఖరీఫ్ సీజన్ ప్రారంభమై నెల రోజులు
వర్షం కోసం రైతుల ఎదురుచూపులు
ఇదే పరిస్థితి కొనసాగితే పరిస్థితి దయనీయం
ఎల్నినో ప్రభావంతో సాగు భూములన్నీ బీడు భూములుగా మారుతున్నాయని అన్నదాతలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా వర్షాభావ పరిస్థితులు కొనసాగుతుండటంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఎల్నినోతో వానలు కురవని పరిస్థితి నెలకొన్నా చంద్రబాబు ప్రభుత్వం మాత్రం ప్రత్యామ్నాయం చూపడం లేదు. కనీసం ఏ పంటలు వేయాలో కూడా అవగాహన కల్పించడం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
శావల్యాపురం: గత ఏడాది ఇదే సీజన్లో వర్షాలు సకాలంలో కురవడంతో జలాశయాలన్నీ నిండుకుండలను తలపించాయి. పంట కాల్వల్లో నిండుగా నీరు రావడంతో రైతులు ఆనందంగా పంటలు సాగు చేశారు. ఈ ఏడాది మాత్రం అందుకు విరుద్ధంగా వాతావరణంలో పలు మార్పులు చోటుచేసుకోవడం, కర్ణాటక ఎగువ జలాశయాల నుంచి వరద నీటి ఉధృతి లేకపోవడంతో శ్రీశైలం, నాగార్జునసాగర్ ఆయకట్టు పరిధిలోని కాల్వలన్నీ ఒట్టిపోయి ఉన్నాయి. వర్షాలు లేకపోవడంతోపాటు ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు రాకపోవడం కూడా రైతులకు శాపంగా మారింది. దానికి తోడు నిత్యం అధిక ఉష్ణోగ్రతల తీవ్రతతో భూమిలో తేమ కోల్పోయి పంట భూములన్నీ బీటలువారుతున్నట్లు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయంపై ఆధారపడి జీవించే రైతులు కూలీ పనులకు వెళ్లలేక, మరోవైపు వర్షాలు లేక సాగు చేయలేక అన్నదాతల పరిస్థితి దయనీయంగా మారింది.
నిదర్శనం ఇదిగో...
వినుకొండ నియోజకవర్గంలో 23,337 హెక్టార్ల సాగు భూములు ఉండగా, ఇప్పటి వరకు కేవలం బోరు బావుల ఆధారంగా 1,143 హెక్టార్లలో మాత్రమే పంటలు సాగు చేశారు. ప్రస్తుతం బోరు బావుల్లో ఉన్న నీరు కూడా వేడి గాలులకు ఎండిపోవడంతో ఉన్న కాస్త పంట కూడా దక్కదని రైతులు వాపోతున్నారు. శావల్యాపురం మండలంలో వ్యవసాయ అధికారుల లెక్కల మేరకు ఎకరం కూడా సాగు కాలేదు. వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో పాడి పరిశ్రమ కూడా దెబ్బతినే పరిస్థితి వస్తుందని రైతులు చెబుతున్నారు. ప్రస్తుతం గేదెలకు గ్రాసం కొరత ఏర్పడింది.
శావల్యాపురం 3,164 00
ఈపూరు 5,478 78
నూజెండ్ల 5,744 80
బొల్లాపల్లి 4,794 790
వినుకొండ రూరల్ 4,157 195


