సత్తెనపల్లి: ప్రతి పౌరుడు వినియోగదారుల హక్కులు, చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ సెక్రటరీ, న్యాయమూర్తి సయ్యద్ జియావుద్దీన్ అన్నారు. సత్తెనపల్లి మండలం కంకణాలపల్లి సచివాలయంలో కూలీలకు బుధవారం నిర్వహించిన న్యాయ అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. కూలీలు తమ హక్కులు, చట్టపరమైన రక్షణలపై అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అనుకోని ప్రమాదాలు, ఇతర న్యాయ పరమైన సమస్యలు ఎదురైనప్పుడు పారాలీగల్ వలంటీర్లను సంప్రదించాలన్నారు. ప్రతి కుటుంబం జనన, వివాహ తదితర కీలక ధ్రువపత్రాలను తప్పనిసరిగా పొందాలని సూచించారు. ముందుగా పట్టణంలోని సబ్జైల్ను ఆయన సందర్శించారు. రాజీ మార్గమే రాజ మార్గమని, లోక్ అదాలత్ తీర్పు అంతిమం అన్నారు. ఈ సందర్భంగా పలు చట్టాల గురించి వివరించారు. ఆయా కార్యక్రమాలలో ప్యానల్ న్యాయవాది బీఎల్ కోటేశ్వరరావు (సత్తెనపల్లి), కాళిదాసు (గుంటూరు), పారాలీగల్ వలంటీర్లు షేక్ సుభాని, వెంకటేశ్వర రావు, కోర్టు సిబ్బంది, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


