సత్తెనపల్లి: జాతీయ రహదారి విస్తరణ పనుల్లో డ్రైవర్ నిర్లక్ష్యం ఓ యువతి నిండు ప్రాణాన్ని బలిగొంది. రోడ్డుపై వెళుతున్న ఇంజినీరింగ్ విద్యార్థినికి క్రేన్ బలంగా తగలటంతో తీవ్రంగా గాయపడి ఆసుపత్రికి తరలించేలోపు మృతి చెందింది. పొన్నూరు సమీపంలోని మామిళ్లపల్లి గ్రామానికి చెందిన లలితశ్రీ (21) నలంద కళాశాలలో ఇంజినీరింగ్ నాలుగో సంవత్సరం చదువుతోంది. రోడ్డుపై వెళుతుండగా రహదారి విస్తరణ పనులు నిమిత్తం వచ్చిన క్రేన్ డ్రైవర్ అజాగ్రత్త వలన ఆమెకు క్రేన్ తగిలి కింద పడిపోయింది. స్థానికులు గమనించి, డ్రైవర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి తీవ్రంగా గాయపడిన విద్యార్థినిని ఆసుపత్రికి తరలించారు. చికిత్స చేసే సమయానికి పరిస్థితి విషమించి మృతి చెందింది. రహదారి పనుల వద్ద కనీస భద్రత ప్రమాణాలు పాటించకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


