స్వీకరించిన అదనపు ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి
నరసరావుపేట రూరల్: పీజీఆర్ఎస్ ఫిర్యాదులను సత్వరం పరిష్కరించి ఉత్తమ సేవలు అందించడమే లక్ష్యమని జిల్లా అదనపు ఎస్పీ(అడ్మిన్) రోహిత్ కుమార్ చౌదరి తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం పీజీఆర్ఎస్ నిర్వహించారు. అదనపు ఎస్పీ రోహిత్కుమార్ చౌదరి కార్యక్రమంలో పాల్గొని ఫిర్యాదులు స్వీకరించారు. ఆర్ధిక, కుటుంబ సమస్యలుతో పాటు మోసాలు, బెదిరింపులు, ఆక్రమణలు వంటి పలు అంశాలకు సంబంధించిన 88 ఫిర్యాదులు అందాయి. పీజీఆర్ఎస్లో మహిళలు, వృద్ధుల ఫిర్యాదుల పరిష్కారం పట్ల ప్రత్యేక దృష్టి సారించి క్షేత్రస్థాయిలో విచారణ వేగవంతంగా పూర్తిచేసి చట్ట ప్రకారం న్యాయం చేయాలని సూచించారు.
ఆస్తి కోసం కుమారుడు వేధిస్తున్నాడు
జీవన భృతిగా ఉన్న పొలాన్ని ఇవ్వమని పెద్ద కుమారుడు వేధిస్తున్నాడని మాచర్ల మండలం రాయవరం గ్రామానికి చెందిన వృద్దుడు ఫిర్యాదు చేసాడు. తనకు ఇరువురు సంతానం కాగా వీరికి వివాహం చేసి ఆస్తిని పంచి ఇచ్చినట్టు తెలిపాడు. నాలుగు సంవత్సరాల క్రితం భార్య చనిపోవడంతో ఒంటరిగా నివసిస్తున్నానని వివరించాడు. జీవనభృతిగా ఉంచుకున్న నాలుగు ఎకరాలను తనకు ఇవ్వమని పెద్ద కుమారుడు మద్యం సేవించి వచ్చి ఇబ్బంది పెడుతున్నట్టు ఫిర్యాదులో తెలిపాడు. కుమారుడిపై చట్టరీత్యా చర్యలు తీసుకుని న్యాయం చేయాలని కోరాడు.
పెళ్లి చేసుకుని ఎన్ఆర్ఐ మోసం
ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన అల్లుడు గత కొంతకాలంగా కుమార్తెతో మాట్లాడటం లేదని, దీనిపై వారి కుటుంబసభ్యులను ప్రశ్నిస్తే విడాకులు ఇవ్వమని అంటున్నారని శావల్యాపురం మండలం కొత్తలూరు గ్రామానికి చెందిన వ్యక్తి ఫిర్యా దు చేసాడు. 8 సంవత్సరాల క్రితం గురజాలలో నివసం ఉంటున్న యువకుడితో కుమార్తెకు వివా హం చేసినట్టు తెలిపాడు. వీరికి కుమార్తె ఉన్నారని పేర్కొన్నాడు. ఉన్నత చదువుల కోసం ఆస్ట్రేలియా వెళ్లిన అల్లుడు కొంత కాలం కుమార్తెతో ఫోన్లో మాట్లాడినట్టు వివరించాడు. తరువాత ఫోన్లో అందుబాటులో లేకుండా కుమార్తెను మానసికంగా హింసిస్తున్నట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు.
రైతులకు మిర్చి వ్యాపారి టోకరా
మిర్చిని కొనుగోలు చేసిన వ్యాపారి డబ్బులు చెల్లించకుండా వేదిస్తున్నాడని కారంపూడి మండలానికి చెందిన రైతులు ఫిర్యాదు చేసారు. మండలంలోని బట్టువారి పల్లె, పెద్ద కొదమ గుండ్ల, కాచవరం గ్రామాలకు చెందిన 70 మంది రైతుల వద్ద నుంచి గాదెవారిపాలెం చెందిన వ్యాపారి ఎండుమిర్చి కొనుగోలు చేసాడు. ఇందులో రైతులకు కొంత మేరకే నగదు చెల్లించాడు. రైతులకు రూ.1.50కోట్లు చెల్లించాల్సి ఉండగా రైతులు నిలదీయడంతో నా వద్ద డబ్బులు లేవని సమాధానమిస్తున్నాడు. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని రైతులు కోరారు.


