రాజ్యసభ సభ్యుడు భాష్యం రామకృష్ణ
గుంటూరు ఎడ్యుకేషన్: తల్లిదండ్రులు తమపై ఉంచిన విశ్వాసమే భాష్యం విజయానికి పునాది అని, ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ విద్యార్థులకు ఉన్నతమైన భవిష్యత్ను అందించేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నామని రాజ్యసభ సభ్యుడు, భాష్యం విద్యాసంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ అన్నారు. ఆదివారం గోరంట్లలోని ఓ ఫంక్షన్ హాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లోని భాష్యం విద్యాసంస్థలకు చెందిన సెంట్రల్ అడ్మిన్ టీం, ప్రిన్సిపాల్స్, వైస్ ప్రిన్సిపాల్స్, ప్రధానోపాధ్యాయుల ఆధ్వర్యంలో భాష్యం రామకృష్ణకు సన్మానం కార్యక్రమం నిర్వహించారు. రామకృష్ణ మాట్లాడుతూ 1993లో 183 మంది విద్యార్థులతో మొదలైన భాష్యం విద్యాసంస్థలు విజయ ప్రస్థానంలో ప్రతి ఒక్కరి కృషి, సహకారం దాగి ఉన్నాయని, తద్వారా భాష్యం తన స్థానాన్ని పదిలపరచుకుందని పేర్కొన్నారు. భాష్యంలో పనిచేస్తున్న సిబ్బందికి ఎలాంటి కష్టం వచ్చినా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. విద్యాసంస్థల వైస్ చైర్మన్ భాష్యం హనుమంతరావు మాట్లాడుతూ భాష్యం స్థాపించిన నాటి నుంచి తమతో ప్రయాణిస్తున్న ప్రతి ఒక్క సిబ్బందికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలిపారు. తొలుత భాష్యం మెయిన్ క్యాంపస్ నుంచి గోరంట్ల వరకు భాష్యం రామకృష్ణ, వారి కుటుంబ సభ్యులను భాష్యం కార్యనిర్వాహక సిబ్బంది ర్యాలీగా తీసుకెళ్లి వేదమంత్రోచ్ఛరణల మధ్య పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. సభకు భాష్యం ఐఐటీ అకాడమీ ప్రోగ్రామర్ ఆనంద్ కుమార్ ఘన స్వాగతం పలికారు. అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనంతో భాష్యం రామకృష్ణ, ఆయన కుటుంబ సభ్యులను ఆశీర్వదించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన కార్యనిర్వాక సిబ్బంది ఆయన కుటుంబ సభ్యులను ఘనంగా సత్కరించారు.


