మంగళగిరి టౌన్: ఇంట్లో లేని సమయంలో తాళాలు పగలగొట్టి దుండగులు బంగారు ఆభరణాలు, నగదు, వెండి వస్తువులను చోరీ చేసిన ఘటన గురువారం రాత్రి మంగళగిరి పట్టణంలో చోటుచేసుకుంది. సేకరించిన వివరాల మేరకు.. మంగళగిరి పట్టణం కొప్పురావు కాలనీ 9వ లైన్లో గోలి నాగరత్నం నివాసముంటోంది. ఇద్దరు కుమార్తెలకు వివాహం కావడంతో ఇంట్లో ఒంటరిగా జీవిస్తోంది. పెద్ద కుమార్తె తమ ఇంటి సమీపంలోనే ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఆరోగ్యం బాగోలేని కారణంగా గత నాలుగు రోజుల నుంచి రాత్రి సమయంలో పెద్దకుమార్తె ఇంటికి వెళ్లి తిరిగి ఉదయం తన ఇంటికి వస్తుంది. ఈ క్రమంలో 9వ తేదీ రాత్రి 10 గంటల సమయంలో ఇంటికి తాళం వేసి తన పెద్దకుమార్తె ఇంటికి వెళ్లింది. 10వ తేదీ ఉదయం 6 గంటలకు ఇంటికి రాగా ఇంటి తాళం పగలగొట్టి, తలుపులు తీసి ఉండడం గమనించింది. లోపలకు వెళ్లి చూడగా బీరువా లాకర్లో బంగారు హారం, బంగారు నక్లెస్, చెవిపోగులు, నాలుగు ఉంగరాలతో పాటు వెండి ఆభరణాలు, కొంత నగదు చోరీకి గురైనట్లు గుర్తించింది. మొత్తం 9 సవరల బంగారు వస్తువులు, 500 గ్రాముల వెండి వస్తువులతో పాటు కొంత నగదు దొంగిలించుకు పోయారని నాగరత్నం తన ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మంగళగిరి పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు.


