తుమృకోట(రెంటచింతల): మండలంలోని తుమృకోట గ్రామంలో ఇంద్రపల్లి ముత్యాలమ్మ జాతర మహోత్సవ వేడుకలలో భాగంగా 7 వ రోజు గురువారం కుంకుమ బళ్లతో గ్రామ పురవీధులలో ఎంతో ఉత్సాహం...ఉల్లాసంగా గ్రామోత్సవం పెద్ద ఎత్తున నిర్వహించారు. గ్రామ దేవతగా పూజలందుకుంటున్న ఇంద్రపల్లి అమ్మవారికి పూర్వకాలం నుంచి రెండు సంవత్సరాలకు ఒకసారి ముత్యాలమ్మ జాతర వేడుకలను కులమతాలకు అతీతంగా గ్రామంలోని అన్ని వర్గాల ప్రజలు జరుపుకొని, మొక్కులు చెల్లించుకుంటారు. రూ.లక్షల వ్యయంతో 27 కుంకుమ బండ్లు కట్టి వాటిని అందంగా అలంకరించారు. ఆచారంలో భాగంగా ముందు పెద్దకాపు, కరణం, పెద్దశెట్టి కుంకుమబళ్లు, తరువాత వివిధ సామాజిక వర్గాలకు చెందిన మరో 22 బళ్లు గ్రామోత్సవంలో పాల్గొన్నాయి. పోతురాజు, మాతంగి కుంకుమబళ్లకు ముందుండి దేవుని బజార్లలో తిరిగి అనంతరం ముత్యాలమ్మ ఆలయం వద్దకు బళ్లతో సహా చేరుకున్నారు. ఉదయం 10 గం. నుంచి కుంకుమబళ్లతో గ్రామోత్సవం ప్రారంభించి రాత్రి 9 గం. వరకు జాతర చేస్తూ ఆలయం వద్ద వరకు ఊరేంగింపు కొనసాగించారు. ఆలయాన్ని రంగురంగుల విద్యుత్ తోరనాలతో అందంగా ముస్తాబు చేసి అలంకరించారు. జాతర ప్రశాంతంగా నిర్వహించడానికి ఎస్ఐ సీహెచ్ నాగార్జున తన సిబ్బందితో బందోబస్తును ఏర్పాటు చేసి పర్యవేక్షించారు.
అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే
ఏడు రోజులుగా గ్రామంలో నిర్వహిస్తున్న ఇంద్రపల్లి ముత్యాలమ్మ జాతర వేడుకలలో మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి గురువారం పాల్గొనగా ఆలయ చైర్మన్ పోట్ల వెంకటేశ్వర్లు, నాయకులు, గ్రామ పెద్దలు ఘన స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్య వేడుక అయిన కుంకుమబళ్లను ఆయన ప్రారంభించారు.
కుంకుమ బళ్లుతో భక్తిశ్రద్ధలతో గ్రామోత్సవం


