ఏఎన్యూ(పెదకాకాని): ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం దూరవిద్యా కేంద్రం ఆధ్వర్యంలో గత నెలలో నిర్వహించిన బిఏ, బీబీఏ, బీకాం ఆరో సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను విడుదల చేసినట్లు దూరవిద్య కేంద్రం సంచాలకులు వంకాయలపాటి వెంకటేశ్వర్లు తెలిపారు. ఫలితాలను బుధవారం వర్సిటీ వీసీ ఆచార్య కె.గంగాధరరావు చేతుల మీదుగా విడుదల చేశారు. మొత్తం 9,202 మంది విద్యార్థులు హాజరుకాగా, వారిలో 9,024 మంది ఉత్తీర్ణులై 98 శాతం ఉత్తీర్ణత నమోదు చేశారు. విద్యార్థులు తమ ఫలితాలను విశ్వవిద్యాలయ దూరవిద్యా కేంద్రం వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చన్నారు.
పట్నంబజారు(గుంటూరు ఈస్ట్): దేవదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ (డీసీ)గా జనమంచిలి ఏకాంబరం బాధ్యతలు స్వీకరించారు. నాజ్ సెంటర్లోని ఆ శాఖ కార్యాలయంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. ఇంతకు ముందు ఆయన చిత్తూరులోని పోలమాంబ తల్లి, శ్రీకాళహస్తి ఆలయం డిప్యూటీ కమిషనర్గా పనిచేశారు. గతంలో డీసీగా పనిచేసిన కేబీ శ్రీనివాస్ పదవి విరమణ చేసిన నేపథ్యంలో ఏకాంబరం గుంటూరు డీసీగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయాల పరిరక్షణకు బాధ్యతగా పనిచేస్తానని తెలిపారు. ఏకాంబరంను అసిస్టెంట్ కమిషనర్ జి.మాధవి, శాఖ అధికారులు, పలువురు ఈవోలు, సిబ్బంది కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.
తుమృకోట (రెంటచింతల): తుమృకోట గ్రామంలో ఆరు రోజులుగా నిర్వహిస్తున్న ఇంద్రపల్లి ముత్యాలమ్మ జాతరలో భాగంగా బుధవారం ఇంద్రపల్లి ముత్యాలమ్మకు భక్తులు భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పించారు. ఆలయ అర్చకులు నేతృత్వంలో గ్రామ దేవతైన ఇంద్రపల్లి ముత్యాలమ్మకు వేకువజాము నుంచే పంచామృతాభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిపించారు. అన్ని వర్గాల భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని సందర్శించుకుని మొక్కులు చెల్లించి బోనాలు సమర్పించారు. ఆలయ చైర్మన్ పోట్ల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాతరలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా ఎస్ఐ సీహెచ్ నాగార్జున నేతృత్వంలో పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేసి పర్యవేక్షించారు.
నరసరావుపేట: ఈ నెల 11, 12 తేదీలలో విజయవాడ మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి సాహిత్య సమ్మేళనాన్ని పల్నాడు జిల్లాకు చెందిన కవులు, రచయితలు, కళాకారులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పల్నాడు బాలోత్సవం కమిటీ ప్రధాన కార్యదర్శి కట్టా కోటేశ్వరరావు పిలుపునిచ్చారు. బుధవారం కోటప్పకొండ రోడ్డులోని పల్నాడు విజ్ఞాన కేంద్రంలో సాహిత్య సమ్మేళనం పోస్టర్ విజ్ఞాన కేంద్రం బాధ్యులతో కలిసి ఆవిష్కరించారు. సమ్మేళనం రెండు రోజుల పాటు మొత్తం 6 సెషన్లలో నిర్వహిస్తారన్నారు. మొదటిరోజు తెలకపల్లి రవి పాల్గొని ప్రసంగిస్తారని, ముగింపు సభలో కుమారస్వామి అధ్యక్షతన గంటేడు గౌరునాయుడు, ఎంవీఎస్ శర్మ, పిన్నమనేని మురళీకృష్ణ, కె.సత్యరంజన్ మాట్లాడతారని అన్నారు. ప్రముఖ సాహితీవేత్తలు పాల్గొని వివిధ అంశాలపై ప్రసంగాలు, చర్చలు నిర్వహించనున్నట్లు తెలిపారు. విజ్ఞాన కేంద్రం కమిటీ సభ్యులు అనుముల లక్ష్మీశ్వరరెడ్డి, షేక్ మస్తాన్వలి పాల్గొన్నారు.


