జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కృతికా శుక్లా
పిడుగురాళ్ల: ఎస్ఐఆర్ వెరిఫికేషన్ ప్రక్రియను క్షేత్రస్థాయిలో కచ్చితత్వంతో నిర్వహించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కృతికా శుక్లా అన్నారు. పట్టణంలోని రైల్వేస్టేషన్ రోడ్డులో జరుగుతున్న సమగ్ర ఓటర్ల జాబితా సవరణ(ఎస్ఐఆర్) పక్రియను జిల్లా కలెక్టర్ బుధవారం పరిశీలించారు. ఇంటింటికి వెళ్లి చేపడుతున్న వెరిఫికేషన్, ఎన్యూమరేషన్ ఫారాల సేకరణ, ఓటర్ల వివరాల నిర్ధారణ, డిజిటలైజేషన్ పురోగతిని కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. ప్రతి అర్హులైన ఓటరును తప్పనిసరిగా సంప్రదించి, వివరాలను నిబంధనల ప్రకారం ధ్రువీకరించాలని బీఎల్వోలకు సూచించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఎస్ఐఆర్ ప్రక్రియ ఈనెల 14 వరకు కొనసాగుతుందని, ప్రతి బూత్ లెవల్ అధికారి, తమ పోలింగ్ కేంద్రం పరిధిలో ప్రతి ఇంటిని సందర్శించి గణన ఫారం ఓటర్లకు అందజేశారన్నారు. ప్రజలు ఫారం పూర్తి చేసి బీఎల్వోలకు అందజేయాలని తెలిపారు. ఎస్ఐఆర్ ప్రక్రియను భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా, పారదర్శకంగా నిష్పక్షికంగా నిర్వహించాలని, ఎలాంటి పొరపాట్లు తావులేకుండా ప్రతి దశలో జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మంచి పనితీరు కనబరుస్తున్న బీఎల్వోల మాదిరిగా బాధ్యతాయుతంగా పని చేసి కార్యక్రమాన్ని నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్డీవో మురళీకృష్ణ, కమిషనర్ ఐ శ్రీనివాసులు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ జైలాబ్దిన్, బీఎల్వోలు, బీఎల్ఏలు తదితరులు పాల్గొన్నారు.


