నరసరావుపేట: కుల వివక్ష లేని సమాజ నిర్మాణమే లక్ష్యంగా అన్ని ప్రజా సంఘాలు ఏకమై ‘సామాజిక శంఖారావం‘ పూరించాలని రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి.కృష్ణయ్య పిలుపునిచ్చారు. బుధవారం కోటప్పకొండ రోడ్డులోని పల్నాడు విజ్ఞాన కేంద్రంలో ‘కుల వివక్ష లేని సమాజం కోసం సామాజిక శంఖారావం‘ పేరుతో జిల్లా స్థాయి వర్క్షాప్ నిర్వహించారు. కౌలు రైతు సంఘం పల్నాడు జిల్లా కార్యదర్శి వై.రాధాకృష్ణ అధ్యక్షతన నిర్వహించిన వర్క్షాప్ లో కృష్ణయ్య మాట్లాడుతూ రాజ్యాంగంలోని ఆర్టికల్–14 ప్రకారం చట్టం ముందు అందరూ సమానులని, ఆర్టికల్–15 కుల వివక్షను నిషేధిస్తుందని, ఆర్టికల్–17 అంటరానితనాన్ని పూర్తిగా రద్దుచేస్తుందని అన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి జి.రవిబాబు మాట్లాడుతూ కుల వివక్ష నిర్మూలనే లక్ష్యంగా ఈ నెల 16 నుంచి వచ్చే నెల 23 వరకు జిల్లావ్యాప్తంగా వివిధ రూపాల్లో నిరసనలు, అవగాహన కార్యక్రమాలు, అధికారులకు వినతిపత్రాల అందజేత 24న కలెక్టరేట్ ముట్టడికి పిలుపు ఇచ్చారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి వంకాయలపాటి శివ నాగరాణి, జిల్లా అధ్యక్షురాలు మాధవి, సీఐటీయు పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.ఆంజనేయులు నాయక్, ప్రజా సంఘాల నాయకులు ఏ.లక్ష్మీశ్వరరెడ్డి, నాగమల్లేశ్వరరావు, పెద్దిరాజు, నాగేశ్వరరావు, వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.
రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి.కృష్ణయ్య


