తెనాలి: రోటరీ కళాపరిషత్, ఈదర రామారావు ఛారిటబుల్ ట్రస్ట్ సంయుక్త నిర్వహణలో స్థానిక తెనాలి రామకృష్ణకవి కళాపరిషత్లో రాష్ట్రస్థాయి తృతీయ ఆహ్వాన నాటికలు మూడో రోజైన మంగళవారం కొనసాగాయి. మాజీ మంత్రి నన్నపనేని రాజకుమారి జ్యోతి ప్రజ్వలన చేశారు. రాత్రి ఏడు గంటలకు ఏర్పాటైన ప్రత్యేక సభకు నల్లూరి వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించారు. రోటరీ వ్యవస్థాపకుడు పాల్ హారిస్ పురస్కారాన్ని ప్రముఖ రొటేరియన్ డీకే ఆనంద్ దంపతులకు రోటరీ పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ అన్నే రత్నప్రభాకర్ చేతులమీదుగా ప్రదానం చేశారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిలిం, టీవీ, థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్, నాటక పరిశోధకుడు డాక్టర్ కందిమళ్ల సాంబశివరావు మాట్లాడుతూ, బ్రిటిష్ హయాంలోనే డీకే ఆనంద్ తండ్రి రంగస్థలంపై నటించారని, కళాకారుడి కుటుంబానికి చెందిన రొటేరియన్ ఆనంద్కు పాల్హారిస్ పురస్కారం ఇవ్వటం సముచితమని చెప్పారు. ప్రముఖ సినీమాటల రచయిత డాక్టర్ సాయిమాధవ్ బుర్రా, రోటరీ డిస్ట్రిక్ట్–3150 అధ్యక్షుడు సోమవరపు రాంప్రసాద్, ఎఫర్ట్ ఆర్గనైజేషన్, మార్టూరు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జేవీ మోహనరావు, రోటరీ క్లబ్, తెనాలి అధ్యక్షుడు గుమ్మడి సరోజ్బాబు, ఈదర శ్రీనివాసరావు పాల్గొన్నారు. నిర్వాహక సంస్థల అధ్యక్షుడు ఈదర వెంకట పూర్ణచంద్ పర్యవేక్షించారు. తొలుత తెలుగు కళాసమితి, విశాఖపట్నం వారి ‘చిటికెన వేలు’ నాటికను ప్రదర్శించారు. అట్టాడ అప్పలనాయుడు రచనకు చలసాని కృష్ణప్రసాద్ దర్శకత్వం వహించారు. చివరగా చైతన్య కళాస్రవంతి, ఉక్కునగరం, విశాఖ వారి ‘అగ్నిసాక్షి’ నాటికను ప్రదర్శించారు. మాడభూషి దివాకర్బాబు రచనకు పి.బాలాజీనాయక్ దర్శకత్వం వహించారు. రెండు నాటికలూ ప్రేక్షకులను ఆలోచింపజేసేలా సాగాయి.
ప్రముఖ రొటేరియన్ డీకే ఆనంద్ దంపతులకు
రోటరీ వ్యవస్థాపకుడు పాల్ హారిస్ పురస్కారం ప్రదానం


