మహిళా దినోత్సవం సందర్భంగా క్రీడా పోటీలు
గుంటూరు మెడికల్: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మార్చి 8న ఏపీ ఎన్జీజీవోస్ గుంటూరు జిల్లా ఆధ్వర్యంలో జిల్లాలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులకు మార్చి 3, 4 తేదీలలో ఆటల పోటీలు నిర్వహిస్తున్నట్లు ఏపీ ఎన్జీజీవోస్ గుంటూరు జిల్లా అధ్యక్షుడు ఘంటసాల శ్రీనివాసరావు శుక్రవారం తెలిపారు. స్థానిక ఏపీ ఎన్జీజీవోస్ కార్యాలయంలో కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. జిల్లాలోని మహిళ ఉద్యోగులందరూ ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో కార్యదర్శి శ్యాంసుందర్ శ్రీనివాస్, స్టేట్ వైస్ ప్రెసిడెంట్ షేక్ నాగూల్ షరీఫ్, జిల్లా ఉమెన్ వింగ్ చైర్ పర్సన్ ఎస్ కె తాజున్నీసా, కన్వీనర్ ఎం విజయలక్ష్మీ, మహిళా విభాగం కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
నామినేషన్ల ఉపసంహరణ
నెహ్రూనగర్ (గుంటూరు ఈస్ట్) : గుంటూరు నగరపాలక సంస్థ ఎన్టీఆర్ మున్సిపల్ క్రీడా ప్రాంగణం, స్విమ్మింగ్ పూల్ సొసైటీ పాలకవర్గ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ శుక్రవారం జరిగిందని ఎన్టీఆర్ స్టేడియం పాలకవర్గ ఎన్నికల అధికారి సీహెచ్.శ్రీనివాస్ తెలిపారు. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం సెక్రటరీకి ఇద్దరు, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్కు 11 మంది (పురుషులు), ముగ్గురు (మహిళలు) పోటీలో ఉన్నారని, వైస్ ప్రెసిడెంట్ (దామా మహేశ్వరరావు), జాయింట్ సెక్రెటరీకి (పాకనాటి ఉమామహేశ్వరరావు), ట్రెజరర్కి (కండె కాంతారావు)ల నామినేషన్లు ఒక్కొక్కటి ఉన్నాయని, వారి పోస్ట్లు ఎన్నిక లేకుండా ఏకగ్రీవమైనట్లు చెప్పారు. స్టేడియం పాలకవర్గ ఎన్నికలకు సంబంధించి సెకటరీ, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్కు సంబంధించి మార్చి 1న ఎన్టీఆర్ మున్సిపల్ క్రీడా ప్రాంగణంలో ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఎన్నికలు నిర్వహించి అనంతరం లెక్కింపు, ఫలితాల వెల్లడి జరుగుతుందన్నారు.


