
ఉత్కంఠగా ఎడ్ల బండలాగుడు పోటీలు
దాచేపల్లి: దాచేపల్లిలోని శ్రీ వీర్ల అంకమ్మతల్లి ఆలయ తిరునాళ్ల సందర్భంగా రాష్ట్ర స్థాయి ఎడ్ల బలప్రదర్శన పోటీలు శనివారం హోరాహోరీగా సాగాయి. పాలపళ్లు విభాగంలో పల్నాడు జిల్లా అమరావతి మండలం జిడుగు గ్రామానికి చెందిన బీఎస్ఆర్ బుల్ భూపతి శ్రీనివాస్, నూసాయిపేటకి చెందిన గౌరు కార్తీకేయ సంయుక్త ఎడ్ల జత 4,250 అడుగుల దూరం బండ లాగి విజేతగా నిలిచాయి. పల్నాడు జిల్లా మాచవరం మండలం మోర్జంపాడుకు చెందిన కుర్రి గంగరాజు యాదవ్ ఎడ్ల జత 3,609 అడుగుల దూరం బండలాగి రెండో స్థానం, ఫిరంగిపురం మండలం కండ్రిక గ్రామానికి చెందిన కేలం పద్మనాయుడు ఎడ్లజత 3,580 అడుగుల దూరం బండలాగి మూడోస్థానం, బాపట్ల మండలం పాండురంగాపురానికి చెందిన కె. ఏడుకొండలురెడ్డి ఎడ్లజత 3,500 అడుగుల దూరం బండలాగి నాల్గవ స్థానం, ముప్పాళ్ల మండలం మాదల గ్రామానికి చెందిన యర్రంశెట్టి సుబ్బారావు ఎడ్లజత 3,369 అడుగుల దూరం బండలాగి ఐదవస్థానం, దాచేపల్లికి చెందిన యామర్తి శైలేంద్ర ఎడ్లజత 3,103 అడుగుల దూరం బండలాగి ఆరవ స్థానం, సూర్యాపేటకి చెందిన సురేష్, మాచవరం మండలం మల్లవోలుకి చెందిన దొప్పలపూడి మహిమ మణిరత్నం సంయుక్త ఎడ్లజత 2,800 అడుగుల దూరం బండలాగి ఏడవ స్థానంలో నిలిచాయి.
విజేతలకు వరుసగా రూ.20 వేలు, రూ.15 వేలు, రూ.10 వేలు, రూ. 8 వేలు, రూ.7 వేలు, రూ.5 వేలు, రూ. 3వేలు చొప్పున నగదు, షీల్డ్స్ని బహూకరించారు. ఈ పోటీలకు న్యాయనిర్ణేతగా గూడా శ్రీనివాసరావు వ్యవహరించారు. కమిటీ సభ్యులు కొప్పుల గిరి, అనిశెట్టి శ్రీనివాసరావు, యలమల నరేష్ తదితరులు పోటీలు పర్యవేక్షించారు.