నరసరావుపేట: నరసరావుపేట పట్టణంలోని టౌన్హాలు వేదికగా సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సాధారణంగా కలెక్టరేట్లో నిర్వహించే పీజీఆర్ఎస్ వేదిక మార్పును ప్రజలు గమనించుకోవాలన్నారు. నియోజకవర్గ స్థాయిలో పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని నిర్వహించడంలో భాగంగా ఈసారి నరసరావుపేట నియోజకవర్గాన్ని ఎంపిక చేసినట్లు వెల్లడించారు.
ఘనంగా
చెన్నుని పుష్పయాగం
మాచర్ల: మాచర్లలోని శ్రీలక్ష్మీచెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం పుష్పయాగాన్ని ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే స్వామి వారికి ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం ఉత్సవ విగ్రహాలను అలంకరించారు. అర్చకులు కొండవీటి రాజగోపాలాచార్యులు, ఈఓ ఎం పూర్ణచంద్రరావు, జేఏ వీరారెడ్డి, గౌరవాధ్యక్షులు పోలిశెట్టి చంద్రశేఖరరావు, పందిరి సాంబశివరావు, షరాబు వెంకటరత్నం, గజవెల్లి కిషోర్, కంభంపాటి అనిల్కుమార్, సూరె యలమంద, తిరివీధి వెంకట నాగేశ్వరరావు, కంభంపాటి వెంకటరమణలు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వామి వారి పుష్పయాగం మండపంలో జరిపారు. ఈ ఉత్సవాన్ని చూసిన భక్తులు జై చెన్నకేశవ, జై జై చెన్నకేశవ అంటూ నామస్మరణ చేశారు.
పట్టాలు తప్పిన సర్వీసు రైలు
దుగ్గిరాల: దుగ్గిరాల మండలం చిలువూరు గ్రామంలో మరమ్మతుల నిమిత్తం వచ్చిన సర్వీసు రైలు ఆదివారం సాయంత్రం పట్టాలు తప్పింది. అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని ప్రమాదానికి కారణాలు తెలుసుకున్నారు. దీంతో గేటు వద్ద భారీగా ట్రాఫిక్కు అంతరాయం కలిగింది.
కార్తికేయుని ఆలయంలో భక్తజన సందడి
మోపిదేవి: శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి దేవస్థానం ఆదివారం భక్తులతో కోలాహలంగా మారింది. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు సుదూరప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం కళకళలాడింది. నాగపుట్ట, నాగమల్లి వృక్షం, పొంగళ్లశాల వద్ద భక్తులతో క్యూలు సందడిగా మారాయి. అన్నప్రసాదం ప్రాంగణం వద్ద భక్తులు బారులు తీరి కనిపించారు. డెప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు ఆధ్వర్యంలో సూపరిటెండెంట్ బొప్పన సత్యనారాయణ ఏర్పాట్లను పర్యవేక్షించారు.
క్రికెట్ ఆడుతుండగా
గుండెపోటు
యువకుడి దుర్మరణం
వినుకొండ: క్రికెట్ ఆడుతుండగా గుండెపోటుకు గురై యువకుడు మృతి చెందిన ఘటన పట్టణంలో శనివారం జరిగింది. టీడీపీ యూత్ ఆధ్వర్యంలో పట్టణంలోని కుమ్మరి బజారులో క్రికెట్ టోర్నమెంట్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో స్థానిక రణాహుస్సేన్ బజారుకు చెందిన షేక్ గౌస్బాషా (చంటి)(22) శనివారం సాయంత్రం క్రికెట్ ఆడుతూ గుండెపోటుకు గురయ్యాడు. దీంతో అతనిని స్థానిక ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. అనంతరం కొంతసేపటికి అతడు మృతిచెందాడు. మృతదేహాన్ని చీఫ్విప్ జీవీ ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు, సీపీఐ నాయకులు సండ్రపాటి సైదా, డాక్టర్లు కేఎల్రావు, కాసుల పార్వతి తదితరులు సందర్శించి సంతాపం వ్యక్తం చేశారు. మృతుడు చంటి స్థానిక నిమ్స్ హాస్పిటల్లో ల్యాబ్ టెక్నిషియన్గా పనిచేస్తున్నారు. మూడేళ్ల క్రితమే వివాహమైంది. తల్లిదండ్రులు, ముగ్గురు సోదరులు ఉన్నారు.
నేడు టౌన్హాలులో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక
నేడు టౌన్హాలులో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక