భువనేశ్వర్: ఒడిశా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఓపీసీసీ) ప్రధాన కార్యదర్శిగా బిశ్వజిత్ దాస్ నియమితులు అయ్యారు. ఆయన గత 5 ఏళ్లుగా భువనేశ్వర్ జిల్లా అధ్యక్షుడిగా కీలక బాధ్యతలు విజయవంతంగా నిర్వర్తిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ మార్గదర్శకాల స్ఫూర్తితో తనకు అప్పగించిన బాధ్యతను క్రమశిక్షణ కార్యకర్తగా అంకిత భావంతో నిర్వర్తిస్తానని తెలిపారు. నిరంజన్ పట్నాయక్, శరత్ పట్నాయక్, ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు భక్త చరణ్ దాస్లతో కలిసి పనిచేసి పార్టీ వ్యవహారాల్లో విశేష అనుభవం కలిగి ఉన్నారు.
ముగిసిన గవర్నర్ ఢిల్లీ పర్యటన
భువనేశ్వర్: రాష్ట్ర గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటి దేశ రాజధాని న్యూ ఢిల్లీ 3 రోజుల పర్యటన ముగిసింది. ఈ సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం సంబంధిత ముఖ్యమైన విషయాలపై వీరివురు లోతుగా సంభాషించారు. న్యూ ఢిల్లీ పర్యటనలో సందర్భంగా గవర్నర్ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉప రాష్ట్రపతి సీపీ రాధా కృష్ణన్ లను కలిశారు. ఈ సందర్భంగా వివిధ కార్యక్రమాలకు హాజరయ్యారు.
ఆటోని ఢీకొని నుజ్జు అయిన కారు
భద్రక్ జిల్లా ధామ్నగర్ చౌరస్తా సమీపంలో దుర్ఘటన చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో ఆటోను ఢీకొట్టిన కారు అదుపు తప్పి డివైడర్ను అధిగమించడంతో నుజ్జు అయింది. ఈ ఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారందర్ని భద్రక్ జిల్లా ఆస్పత్రిలో చేర్పించారు. చికి త్స కొనసాగుతుంది. కారు భువనేశ్వర్ నుంచి ఉదొలా వెళ్తున్న సమయంలో ఆటోని ఢీకొంది. ధామ్ నగర్ ఠాణా పోలీసులు ఘటనా స్థలం సందర్శించి విచారణ చేపట్టారు. – భువనేశ్వర్
యువతి అదృశ్యంపై ఫిర్యాదు
రాయగడ: జిల్లాలోని అంబొదల పోలీస్స్టేషన్ పరిధిలోని శారదాపూర్ పంచాయతీ బెరుగుడ గ్రామానికి చెందిన 20 ఏళ్ల యువతి కనిపించడం లేదని కుటుంబీకులు పోలీసులకు ఫిర్యా దు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు అంబొదల పోలీసులు ఆదివారం తెలిపారు.
ఉపకారాగారంలో
విచారణ ఖైదీ మృతి
పర్లాకిమిడి: గజపతి జిల్లా రాయగడ బ్లాక్ జిరాంగో గ్రామానికి చెందిన రాను బోడోరైతో కొద్ది రోజులుగా విచారణ ఖైదీగా ఉప కారాగారంలో ఉన్నారు. ఆయన ఆదివారం తెల్లవారుజామున మృతి చెందాడు. జైలు సూపరింటెండెంట్ సమాచారం మేరకు ఖైదీ రాను బోడోరైతో గతరాత్రి 12 గంటల సమయంలో అనారోగ్యంగా ఉండడంతో ఆయనను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పర్లాకిమిడి ఆదర్శ పోలీస్ ఠాణా ఐఐసి ప్రశాంత్ భూపతి అందిన సమాచారం మేరకు ప్రభుత్వ ఆస్పత్రికి గత రాత్రి చేరుకోగా ఖైదీ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలియజేశారు. ఖైదీ బోడోరైతో మృతితో ఆయన భార్య, బంధువులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేయాలని మృతుని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. కొద్ది రోజుల కిందటే మృతుని భార్య జైలు వద్ద కలిసి మాట్లాడినప్పుడు అనారోగ్యంగా ఉన్నట్టు తెలియజేశాడని భార్య తెలిపింది. ప్రస్తుతం మృతుని భార్య గర్భవతిగా ఉన్నట్టు తెలిసింది. ఈ పరిస్థితిలో తన భర్త మృతిపై దర్యాప్తు చేయాలని ఆమె డిమాండ్ చేస్తోంది.


