ఆసక్తి ఉంటే నేర్పిస్తాను
రుణాలిచ్చి ప్రోత్సహిస్తున్నాం
● కొండ చీపుర్ల తయారీతో ఆర్థిక స్వావలంబన ● ఆదర్శంగా నిలుస్తున్న సీతానగరం మహిళలు ● ప్రోత్సహిస్తే మరింత వృద్ధి
సంతబొమ్మాళి:
చీపురు కడుతున్న చేతులు.. తమ కుటుంబాల భవిష్యత్ను తీర్చిదిద్దుతున్నాయి. ఒకప్పుడు ఒక్కరి తో మొదలైన కొండ చీపుర్ల తయారీ.. ఇప్పుడు పలువురి మహిళలకు ఆదాయ వనరుగా మారింది. మండలంలోని సీతానగరం మహిళలు ఖాళీ సమయాన్ని వృథా చేయకుండా సద్వినియోగం చేసుకు ని ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. గ్రామానికి చెందిన బత్సల ధనలక్ష్మి దగ్గర కొండ చీపుర్ల తయారీని నేర్చుకొని, సొంతిట్లోనే వాటిని తయారు చేస్తూ ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. కుటీర పరిశ్రమ ఏర్పాటుతో స్వశక్తిపై జీవిస్తూ తోటి మహిళలకు ఆదర్శంగా నిలుస్తూ.. మగవారికి ఏమాత్రం తీసుపోని ఆదాయాన్ని సంపాదిస్తున్నారు.
సీతానగరం గ్రామానికి చెందిన బత్సల ధనలక్ష్మి పన్నెండేళ్ల క్రితం బతుకుతెరువు కోసం అండమాన్ వలస వెళ్లింది. అక్కడ ఉపాధి నిమిత్తం పలు ప్రాంతాల్లో తిరిగి ఒక కుటీర పరిశ్రమలో మూడు నెలలపాటు చీపుర్ల తయారీ నేర్చుకుంది. అనంతరం స్వగ్రామానికి తిరిగి వచ్చి చీపురుతోనే జీవనాధారం పొందాలనుకుంది. తన భర్త సోమేశ్వరరావు ప్రోత్సాహంతో సొంత గ్రామంలోనే దీనిని చిన్న కుటీర పరిశ్రమగా ప్రారంభించింది. మొదట్లో కాస్త పెట్టుబడి పెట్టి శ్రీముఖలింగం, మెళియాపుట్టి ప్రాంతాల నుంచి వీటికి కావాల్సిన కుంచె, నార, తాడును తెచ్చి చీపుర్లు కట్టేది. అది చూసిన చుట్టుపక్కల మహిళలు ఆసక్తితో అమె ఇంటికి వెళ్లి అమెతో పాటు పనిచేస్తూ చీపుర్లు కట్టడం నేర్చుకున్నారు. అనతికాలంలోనే ఆ చీపుర్లుకు మంచి గిరాకీ లభించడంతో ఈ కుటీర పరిశ్రమ ఎంతో మందికి జీవనాధారంగా మారింది. స్వయం సహాయక సంఘాల రుణాలు, సీ్త్ర నిధి రుణాలతో స్వయం ఉపాధి పొందుతూ ఆర్థిక స్వావలంబన దిశగా మగువలు అడుగులు వేస్తున్నారు.
గ్రామంలో 280 కుటుంబాలు ఉండగా.. ప్రస్తుతం 70కు పైగా కుటుంబాల మహిళలు చేతివృత్తిలా నిత్యం పని చేస్తుంటారు. ఒక చీపురు ధర రూ.70ల నుంచి రూ.100ల వరకు పలుకుతోంది. రోజుకు 20 నుంచి 30 చీపుర్లు సులువుగా కట్టి, ఖర్చులు పోను రూ.700లకు పైబడి సంపాదిస్తున్నారు. ప్రస్తుతం గ్రామంలో 150 మందికి పైగా చీపుర్లు తయారు చేస్తున్న మహిళలు ఉన్నారు. వీరు తయా రు చేసిన చీపుర్లు మంచి ఆకర్షణతో పాటు నాణ్యత గా ఉండడంతో బయట మార్కెట్ల్లో మంచి గిరాకీ ఏర్పడింది. వీటిని మన జిల్లాతో పాటు విజయనగరం, విశాఖపట్నం, ఒడిశా రాష్ట్రానికి ఎగుమతి చేసి అమ్ముతుంటారు. సీజన్తో సంబంధం లేకుండా నిత్యం పెట్టుబడి పెట్టాల్సిన పరిశ్రమ కాబట్టి బయ ట నుంచి అప్పులు తెస్తే అర్థిక భారం అవుతుంది. అందువలన ఈ పరిశ్రమను ప్రభుత్వం ప్రోత్సహించాలని కోరుతున్నారు. డ్వాక్రా సంఘాల ద్వారా తయారైన ఉత్పత్తులను ఆలస్యం చేయకుండా ప్రభుత్వం ఎప్పటికప్పుడు మార్కెటింగ్ సదుపా యం కల్పించాలని విన్నవిస్తున్నారు. తద్వారా ఈ పరిశ్రమతో మరింత మందికి ఉపాధి కలిగి వారి జీవితాల్లో వెలుగులు నింపవచ్చు.
అండమాన్లోని ఒక కుటీర పరిశ్రమలో చీపుర్లు తయారు చేయడం నేర్చుకున్నాను. మా గ్రామంలో 150 మంది వరకు చీపుర్లు కట్టడం నేర్పించాను. ఇంటి వద్దనే ఉంటూ రోజువారి ఆదాయం సంపాదించుకుంటున్నాను. ఆసక్తిగా ఉన్న మహిళలను ప్రోత్సహించి నేర్పిస్తున్నాను. ఇంకా ఎవరికై నా ఆసక్తి ఉంటే చీపురు కట్టడం నేర్పిస్తాను. అవసరమైన ముడి సరుకుల ధరలు అమాంతంగా పెరిగిపోయాయి. దీంతో పెట్టుబడి గతం కంటే ఎక్కువ అయ్యింది. ప్రభుత్వం మమ్మల్ని ప్రోత్సహించాలి.
– బచ్చల ధనలక్ష్మి,
చీపురు తయారీదారు, సీతానగరం
సీతానగరంలో చీపుర్లు కడుతున్న మహిళలకు పొదుపు సంఘాలు, సీ్త్ర నిధి ద్వారా తక్షణ రుణాలిచ్చి ప్రోత్సహిస్తున్నాము. దీనిని అర్హులైన మహిళలు అందరూ సద్వినియోగం చేసుకోవాలి. గతంలో రెండు పర్యాయాలు శ్రీకాకుళంలో జరిగిన డ్వాక్రా బజారుకు మండలం నుంచి మహిళలు వెళ్లి చీపుర్లు అమ్మడం జరిగింది.
– శ్రీనివాసరావు,
వెలుగు ఏపీఎం, సంతబొమ్మాళి


