పర్లాకిమిడి: స్థానిక నగరపాలక హాల్లో మంగళవారం సాయంత్రం ప్రముఖ చలనచిత్ర గాయకులు పద్మశ్రీ రఘునాథ పాణిగ్రాహి 95 జయంతి ఉత్సవాన్ని ఒడిశా సంగీత నాటక అకాడమీ (భువనేశ్వర్), భక్తి నైవేద్యం సంస్థ ఆధ్వర్యంలో ఒడియా భాష, సంస్కృతి విభాగం ఆధ్వర్యంలో జరిగింది. ఈ నృత్య, సంగీత కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సబ్కలెక్టర్ అనుప్ పండా, అతిథులుగా దూరదర్శన్ కంఠశిల్పి రఘునాథ పాత్రో, జిల్లా సాంస్కృతిక శాఖ అధికారి అర్చనా మంగరాజ్, ఆదర్శదాస్, తదితరులు హాజరయ్యారు. 1932 ఆగస్టు 10న గుణుపురం వద్ద లివురిగ్రామంలో పుట్టిన పండిత రఘునాథ పాణిగ్రాహి తెలుగు, తమిళ, ఒడియా భాషల్లో అనేక పాటలు పాడారు. తెలుగులో 1956లో వచ్చిన ఇలవేల్పు సినిమాలో ఓ గీతాన్ని పి.సుశీలతో కలిసి పాడారు. పండిత నీలమణి పాణిగ్రాహివద్ద సంగీతం నేర్చుకుని అనంతరం విజయనగరం సంగీత విద్యాలయంలో ప్రముఖ సంగీతవిద్యాంసులు ద్వారంపూడి వెంకయ్యనాయుడు సహాకారంతో పాఠశాలలో చేరారు. అనంతరం పండిత నరసింహా శర్మ, పండిత రఘునాథ దాస్ వద్ద సంగీత శిక్షణ అభ్యసించి అనతికాలంలో అనేక తెలుగు, ఒడియా భాషాల్లో చలనచిత్రాలకు పాటలు పాడారు. ఆయనకు 1968లో సురమణి సమ్మాన్, 1982లో ఫ్రాన్స్ ప్రభుత్వం గ్రాండ్ పిక్స్ ఆవార్డులు లభించాయి.
ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం 2008లో జయదేవ్ సమ్మాన్ ఆవార్డు, కేంద్ర ప్రభుత్వం 2010లో పద్మశ్రీ ఆవార్డును రఘునాథ పాణిగ్రాహికి అందజేసినట్టు పండిత రఘునాథ పాత్రో తెలియజేశారు. ఆయన ప్రతిభకు గౌరవసూచకంగా భక్తి నైవేద్య సంస్థ, ఇతర గాయకులు ఒడిస్సీ సంగీతం, నృత్యం విభావరిని నిర్వహించారు.


