● కోట్పాడ్ ఎమ్మెల్యే రూపు భొత్ర
జయపురం: పాఠశాలల అభివృద్ధికి కృషి చేస్తానని జయపురం సబ్డివిజన్ కోట్పాడ్ ఎమ్మెల్యే రూపు భొత్ర అన్నారు. కుంధ్ర సమితి రాణిగుడ గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను శుక్రవారం సందర్శించిన ఆయన మౌలిక సౌకర్యాలు, మధ్యాహ్న భోజన పథకం అమలు తీరు, నాణ్యతను తెలుసుకున్నారు. భోజనంపై విద్యార్థుల అభిప్రాయాన్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం పాఠశాల స్థితిగతులపై ఉపాధ్యాయులతో చర్చించారు. విద్యార్థులకు పెట్టే మధ్యాహ్న భోజనం విషయంలో రాజీ పడవద్దన్నారు. మంచి కూరగాయలు, గుడ్లు, బియ్యం వంటలకు వినియోగించాలని ప్రధాన ఉపాధ్యాయుడుని ఆదేశించారు. భోజనాలలో ఎటువంటి నాణ్యత తగ్గినా తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పాఠశాలలో నెలకున్న సమస్యలను తాను త్వరలోనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అలాగే పాఠశాల ఉన్నతికి, అదనపు తరగతి గదుల నిర్మాణానికి ఎమ్మెల్యే ల్యాడ్ నుంచి నిధులు మంజూరు చేస్తానని వెల్లడించారు. అనంతరం పాఠశాలలో నిర్వహిస్తున్న తరగతుల గదులను సందర్శించారు. విద్యార్థులకు పాఠాలు చెప్పి ప్రశ్నలు అడిగి ప్రతిభను పరీక్షించారు. విద్యార్థులకు గుణాత్మక విద్య బోధించాలని ఉపాధ్యాయులకు సూచించిన ఆయన క్రమశిక్షణతో చదువుకోవాలని విద్యార్థులకు హితబోధ చేశారు.


