పర్లాకిమిడి: జిల్లాలో కాశీనగర్ బ్లాక్ అల్లడ పంచాయతీలో పలు సమస్యలను సోమవారం పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి పర్యటించి తెలుసుకున్నారు. అల్లడ గ్రామపంచాయతీలో ఘనసాగర్ గ్రామం, లెంతగుడ, మంజిల్ గుడ, కోడాగుడ, డిడింగుడ, వంటి అనేక ఆదివాసీ గ్రామాల్లో ప్రజల నుంచి వినతులను ఎమ్మెల్యే స్వీకరించారు. ముఖ్యంగా అల్లడ గ్రామ పంచాయతీ నుంచి అరమొడా గ్రామం వరకు పక్కా రోడ్డు నిర్మాణం కోసం ఎమ్మెల్యే రూపేష్ వద్ద ప్రజలు విన్నవించారు. కాశీనగర్ బ్లాక్లో ఉన్న అల్లడ పంచాయతీలో ప్రాథమిక విద్య, రవాణా, ఆరోగ్యం, తాగునీరు, రోడ్డు సౌకర్యం, సాగునీరు, డ్రైనేజీ నిర్మించాల ని కాశీనగర్ సమితి అధ్యక్షురాలు బల్ల శాయమ్మను కోరారు. సర్పంచ్ గోపాల్ శోబోరో, సమితి సభ్యురాలు పద్మినీ శోబోరో, జగన్నాథ సాహు, తదితరులు పాల్గొన్నారు.
జయపురం: జయపురం సమితి పుట్రగుడ గ్రామంలో జయపురం తెలుగు సంస్కృతిక సమితి వారి సిటీ ఉన్నత పాఠశాల ఎకో క్లబ్, ఎనర్జీ క్లబ్ విద్యార్థులు, జయపురం షోషియల్ ఎన్విరోన్మెంటల్, ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ అషో షియేషన్ (సీవా)స్వచ్ఛంద సంస్థలు సంయుక్తంగా ఆదివారం వనమహోత్సవం నిర్వహించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, సీవా కార్యకర్తలు, గ్రామస్తులు కలిసి పుట్రగుడ పరిసరాలలో వివిధ జాతుల మొక్కను నాటారు. పాఠశాల ఎకో క్లబ్ ఇన్చార్జి ఉపాధ్యాయుడు, సీవా కార్యదర్శి ప్రతాప్ కుమాఇర్ పట్నాయక్, తదితరులు పాల్గొన్నారు.
భువనేశ్వర్: స్థానిక చంద్రశేఖర్ పూర్ ప్రాంతంలో సోమవారం ఒక నివాస అపార్ట్మెంట్ సముదాయ ప్రాంగణంలో 11వ తరగతి విద్యార్థి మృతదేహం లభ్యమైంది. తోటి విద్యార్థినిని కలిసిన తర్వాత దాక్కునే ప్రయత్నంలో ఆ బాలుడు సర్వీస్ డక్ట్ పైనుంచి ప్రమాదవశాత్తు జారిపడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.మృతుడిని స్థానిక ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థి రోఫాన్ ఖురేషిగా గుర్తించారు. భువనేశ్వర్ డీసీపీ జగ్మోహన్ మీనా కథనం ప్రకారం.. తన తోటి బాలిక విద్యార్థిని ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు ఆమెను కలవడానికి అతను జల వాయు అపార్ట్మెంట్కు వెళ్లాడు. ఇంతలో మధ్యాహ్నం పూట బాలిక తల్లి ఇంటికి తిరిగి రావడంతో అక్కడ కలకలం రేగింది. రోఫాన్ బాత్రూంలో దాక్కుని ఎవరికీ కనపడకుండా ఉండేందుకు దాని పక్కనే ఉన్న సర్వీస్ డక్ట్లోకి ప్రవేశించి ఉంటాడని అనుమానిస్తున్నారు. దర్యాప్తు సమయంలో తొమ్మిదో అంతస్తులోని సర్వీస్ డక్ట్ సమీపంలో వేలాడుతున్న బాలుడి బ్యాగ్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో అతను ఆ ప్రాంతం నుంచి ప్రమాదవశాత్తు జారిపడి ఉండవచ్చనే అనుమానం బలపడింది. శాసీ్త్రయ బృందం అపార్ట్మెంట్ సముదాయానికి చేరుకుని సాక్ష్యాలను సేకరించింది. మృత దేహాన్ని పోస్ట్మార్టం పరీక్ష కోసం పంపారు. ఆ బాలుడి మరణానికి దారి తీసిన సంఘటనల కచ్చితమైన క్రమాన్ని నిర్ధారించేందుకు పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది.
పర్లాకిమిడి: ఒడిశా పి.సి.సి అధ్యక్షుడు భక్త చరణ్ దాస్ ఆదేశాల మేరకు స్థానిక సోండివీధి వద్ద కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నూతనంగా ఎన్నికై న జిల్లా కాంగ్రెస్, బ్లాక్ కాంగ్రెస్, టౌన్ కాంగ్రెస్, కాశీనగర్ ఎన్.ఏ.సి కాంగ్రెస్ నాయకులను సన్మానించారు. గంజాం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు రశ్మిరంజన్ పట్నాయక్, గజపతి జిల్లా అధ్యక్షుడు శంకర్ ప్రధాన్, రాష్ట్ర సేవాదల్ అధ్యక్షుడు శుబేంధు మహాంతి, టౌను షెడ్యుల్డ్ ట్రైబ్ జిల్లా అధ్యక్షుడు పాపారావు, బసంత్ పండా, మహిళా కాంగ్రెస్ నాయకురాలు రంజితా పాణిగ్రాహిలను సన్మానించారు. మహాత్మాగాంధీ విగ్రహానికి పూల మాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. కాంగ్రెస్ నాయకులు రశ్మిరంజన్ పట్నాయక్, అనంతరం కొత్తగా కాంగ్రెస్ పార్టీ బాధ్యతలను స్వీకరించిన బ్లాక్, టౌన్ అధ్యక్షులు, మహిళా కాంగ్రెస్, ఎన్.ఏ.సి. (కాశీనగర్) నాయకులకు పుష్పగుచ్ఛాలు అందజేసి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పర్లాకిమిడి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు సూర్యనారాయణ పాత్రో, రాయఘడ బ్లాక్ అధ్యక్షులు జి.శ్రీనివాస రావు, కాశీనగర్ నగరపాలక అధ్యక్షులు బసంత పండా, రాంప్రసాద్ పట్నాయక్, బి.జనార్దన రావు, లలిత్ మోహాన్ దండసేన, సుదర్శన పండా, అభిమన్యు పండా, తదితరులు పాల్గొన్నారు.


