రాయగడ: ఓటరు జాబితాలో అర్హులందరికీ ఓటు హక్కు కల్పించాలనే లక్ష్యంతో జిల్లా యంత్రాంగం ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. యువతతో పాటు ఇప్పటివరకు ఓటరుగా నమోదు కాని అర్హులను గుర్తించి ఓటరు జాబితాలో చేర్చేందుకు జిల్లా వ్యాప్తంగా విస్తృత కార్యక్రమాలు చేపట్టింది. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ అశుతోష్ కులకర్ణి ఆదేశాల మేరకు జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ప్రతీ పోలింగ్ బూత్లో అర్హులైన యువ ఓటర్లు, నమోదు కాని ఓటర్లను గుర్తించే ప్రక్రియ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో సోమవారం అమలాభట్ట మోడల్ డిగ్రీ కళాశాల, ప్రభుత్వ ఐటీఐలో యువ ఓటర్ల అవగాహన, నమోదు శిబిరాలు నిర్వహించారు. సబ్ కలెక్టర్ రమేష్ కుమర్ జెన్న ఆధ్వర్యంలో రాయగడ బిడిఓ సుజిత్ కుమార్ మిశ్రో, మున్సిపాలిటీ కార్యనిర్వాహక అధికారి కులదీప్ కుమార్, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా యువతకు ఓటరు నమోదు ప్రాముఖ్యతను అధికారులు వివరించారు. ప్రజాప్రతినిధుల చట్టం–1950లోని సెక్షన్ 16, 19 ప్రకారం ఓటరుగా నమోదు కావడానికి అవసరమైన అర్హతలు, అనర్హతలు, సెక్షన్ 17, 18 ప్రకారం ఒకటి కంటే ఎక్కువ ప్రాంతాల్లో ఓటరు నమోదుపై ఉన్న నిబంధనలను వివరించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. మోడల్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శ్యామ్ మహాపాత్రో, రాజకీయ శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ సంయుక్త మాఝి ఓటరు గురించి వివరించారు. ముసాయిదా ఓటరు జాబితా జులై 5న విడుదల కాగా.. కొత్తగా పేరు నమోదు, సవరణలు, అభ్యంతరాల కోసం ఆగష్టు 4వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.


