కొరాపుట్: ట్రక్ ఢీ కొని ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి చెందారు. సోమవారం సాయంత్రం నబరంగ్పూర్ జిల్లా రాయిఘర్ సమితి దబ్లాపారా గ్రామం వద్ద ఒకే బైక్ పై ఐదుగురు వ్యక్తులు ప్రయాణం చేస్తున్నారు. ఇదే సమయంలో రాయిఘర్ నుంచి చత్తీస్గఢ్ వెళ్తున్న సీజీ 04 ఎంవై 1502 అనే ట్రక్ ఢీకొంది. సంఘటన స్థలంలో ముగ్గురు చనిపోగా మరో ఇద్దరిని ఉమ్మర్కోట్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చత్తీస్గఢ్ రాష్ట్రం కరతాబెడా గ్రామానికి చెందిన బాబులాల్ గొండో (50) కస్కాంగా పంచాయతీ హిరి గ్రామానికి వచ్చారు. తిరిగి తన గ్రామానికి తన కుటుంబ సభ్యులతో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సంఘటన స్థలంలో తన ఆరు, ఏడేళ్ల వయసు ఉన్న ఇద్దరు కుమారులు అక్కడే చనిపోయారు. వెంటనే కుందేయి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ట్రక్ని స్వాధీనం చేసుకున్నారు.


