జయపురం: జయపురంలో చారిత్రాత్మక రథాయాత్రకు ఈ ఏడాది శ్రీక్షేత్ర పూరీ రథయాత్ర రథం మో డల్లో అతి సుందరంగా రథం రూపుదిద్దుకుంటున్నది. జయపురం దేవాదాయ విభాగం వారు దాదాపు రూ.30 లక్షల వ్యయంతో నిర్మిస్తున్నారు. రథాన్ని గతంలో ఎన్నడూ లేనంత ఎత్తు, వెడల్పు తో తయారు చేస్తున్నారు. మహారాజుల సమయం నుంచి జయపురంలో జరుగుతున్న రథయాత్రలో తయారుచేసిన రథాలను మరిపించేలా ఈ ఏడాది రథం ఎత్తు 44 అడుగులకు పెంచారు. శిఖరంపై ఉండే జండాతో రథం ఎత్తు 50 అడుగులు. రథం దిగువ మట్టం వెడల్పు 30 అడుగులకు పెంచారు. రథం దిగువ అంతస్తు నేల నుంచి 4 అడుగుల ఎత్తు, రథ చక్రాల వ్యాసం సుమారు 7 అడుగులు, నేటి జయపురం రథానికి మరో ప్రత్యేకత రథానికి వినియోగించే కలప అంతా కొత్తది కావటం గమనార్హం. ఆదివారం రథంపై శ్రీజగన్నాథ్, బలభద్ర, సుభద్ర మూల మూర్తులను రథోరోహణ చేస్తారు. ఈ నెల 17వ తేదీన అంగరంగవైభవంగా జయపురంలో రథయాత్ర నిర్వహిస్తారు.


