● పొలంలో మొసలి పిల్ల కలకలం
నబరంగ్పూర్ జిల్లాలో వ్యవసాయ పొలంలో మొసలి పిల్ల కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళ్తే.. ఉమ్మర్కోట్ పట్టణ సమీపంలోని దర్గాగుడ గ్రామంలో భఘీ శెఠి అనే వ్యక్తి ట్రాక్టర్తో పొలం చదును చేయిస్తున్నాడు. అంతలో బురదలో మొసలి పిల్ల కదలికలు కనిపించాయి. వెంటనే ట్రాక్టర్ డ్రైవర్ యజమానికి సమాచారం ఇచ్చాడు. భఘీ శెఠి అప్రమత్తమై రెవెన్యూ అధికారులకు సమాచారం ఇచ్చారు. అటవీ శాఖ అధికారులు వచ్చి మొసలి పిల్లని స్వాధీనం చేసుకున్నారు. అది 70 గ్రాముల బరువు, 28 అంగుళాల పొడవు ఉంది. వయసు ఒక నెలలోపు ఉందని గుర్తించారు. ఈ ప్రాంతంలో భస్కల్ నదితో పాటు అనేక చెరువులు ఉన్నాయి. దీంతో వాటిలో తల్లి మొసలి ఉంటుందని అధికారుల అనుమానిస్తున్నారు. నీటిలోకి దిగేవారు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. మొసలి పిల్లను అటవీ శాఖ కార్యాలయానికి తీసుకెళ్లారు. వైద్య పరీక్షల అనంతరం నదిలో విడిచి పెడతామని ప్రకటించారు. కొరాపుట్:
● ఫకీర్ మోహన్ విశ్వ విద్యాలయంలో విద్యార్థుల ఆందోళన
భువనేశ్వర్:
బాలాసోర్లోని ఫకీర్ మోహన్ విశ్వవిద్యాలయంలో అర్ధరాత్రి అశాంతి నెలకొంది. తమపై దాడి జరిగిందని ఆరోపిస్తూ నర్సింగ్ కళాశాల విద్యార్థినులు నిరసనకు దిగారు. విశ్వ విద్యాలయానికి చెందిన కొందరు విద్యార్థినులు తమను కొట్టారని ఆరోపణలు ఉన్నాయి. ఆందోళనకు దిగిన విద్యార్థినులకు నచ్చజెప్పే ప్రయత్నంలో వైస్ చాన్సలర్ స్పహ కోల్పోయారు. పరీక్షలు ఆలస్యం కావడాన్ని నిరసిస్తూ నర్సింగ్ విద్యార్థినులు ఆందోళన కొనసాగిస్తున్నారు. విశ్వవిద్యాలయం ఏడు, ఎనిమిదో సెమిస్టర్ పరీక్షలు నిర్వహించకపోవడంతో వారు ఆందోళనకు దిగినట్లు వెల్లడించారు. మంగళవారం రాత్రి వైస్ చాన్సలర్తో జరిగిన చర్చ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది.


