రాయగడ: జిల్లాలోని చందిలి పోలీస్ స్టేషన్ పరిధిలోని ముకుందపూర్ గ్రామంలో ఇటీవల జరిగిన సంచలన దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేశారు. నిందితుల నుంచి నగదు, మోటారు సైకిల్, మోబైల్ఫోన్లు, ఇంటి తాళాలు పగులగొట్టేందుకు వినియోగించే పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. చందిలి ఐఐసీ ఉత్తమ్ కుమార్ సాహు తెలియజేసిన వివరాల ప్రకారం.. జూన్ 28, 29 తేదీల మధ్యరాత్రి సుమారు మూడు గంటల సమయంలో ముకుందపూర్ గ్రామానికి చెందిన నమకీన్ వ్యాపారి తపన్ కుమార్ ప్రుష్టి ఇంటిపై ఎనిమిది మంది దుండగులు దాడి చేశారు. ఇంటి తలుపులు పగులగొట్టి లోపలకి చొరబడి కుటుంబ సభ్యులను చంపేస్తామని బెదిరించి రెండు తులాల బంగారు గొలుసు, బంగారు మంగళసూత్రం, 80 వేల రూపాయల నగదును దోచుకుని పరారయ్యారు. ఈ ఘటనపై బాధితుడు చందిలి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు ఈ మేరకు దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక ఆధారాలు సేకరించిన పోలీసులు విశ్వసనీయ సమాచారం మేరకు జులై ఐదో తేదీన టును మాఝి, మను మాఝి, జితేంద్ర నాయక్లను అదుపులొకి తీసుకున్నారు. వారి నుంచి టీవీఎస్ అపాచి మోటార్ సైకిల్, నగదు, మోబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. విచారణలో భాగంగా జితేంద్ర నాయక్ ఈ దోపిడీతో పాటు మరో రెండు చోరీ కేసుల్లో కూడా ప్రమేయాన్ని అంగీకరించడంతొ దొంగిలించిన నగదులొ కొంత భాగాన్ని పోలీసులు రికవరీ చేసారు. అనంతరం సమాదేవ్ ఛత్రియాను కూడా అరెస్టు చేశారు. అతని నుంచి రూ. 17,500 నగదును స్వాఽధీనం చేసుకున్నారు.


