న్యూస్రీల్
రోడ్డు పక్కన నిరాహార దీక్షలకూ అవకాశం ఇవ్వరు
అధికార పక్షాలకు మాత్రం యథేచ్ఛగా అనుమతులు
బందరు రోడ్డుపై ర్యాలీలు చేసినా పట్టించుకోని వైనం
లోకేష్ పర్యటనలో ఊరేగింపులకు అనుమతులెలా?
వివాదాస్పదంగా మారిన విజయవాడ పోలీసుల తీరు
ఎన్టీఆర్ జిల్లా
మంగళవారం శ్రీ 18 శ్రీ ఆగస్టు శ్రీ 2026
చిలకలపూడి: హైకోర్టు రిజిస్ట్రార్గా బదిలీ అయిన కృష్ణా జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.గోపీని న్యాయ శాఖ ఉద్యోగుల సంఘం సోమవారం బందరులో ఘనంగా సత్కరించారు.
సాక్షి ప్రతినిధి, విజయవాడ: విపక్షాలు రోడ్డు ఎక్క డానికి వీల్లేదు. కనీసం రోడ్డు పక్కన, మెయిన్ రోడ్డుకు దూరంగా రిలే నిరాహార దీక్షా శిబిరం ఏర్పాటు చేసినా ఒప్పుకోరు. ధర్నా చౌక్లో చేసు కోండి అంటూ సూచనలు. విజయవాడలో మరెక్కడ చేసినా ట్రాఫిక్కు సమస్యలు వస్తాయి, ప్రజలు ఇబ్బందులు పడతారంటూ ఆగమేఘాల మీద నోటీసులు నోటీసులు ఇస్తారు. అదే అధికార పార్టీకి చెందిన వారైతే ట్రాఫిక్ గుర్తుకు రాదు. ప్రజల ఇబ్బందులు పట్టవు. నిత్యం రద్దీగా ఉండే బందరు రోడ్డుపైనా ప్రదర్శనలు, ర్యాలీలు నిర్వహించినా ఆ వైపు కన్నెత్తి చూడరు. ఇదీ విజయవాడ పోలీసులు అనుసరిస్తున్న ద్వంద్వ నీతి. విపక్షలకు ని‘బంధనాలు’ విధిస్తూ అధికార పక్షానికి వంత పాడుతున్న పోలీసులపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
రిలే దీక్షలను అడ్డుకున్న పోలీసులు
ఈ నెల మొదటి వారంలో డీఎస్సీలో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలన్న డిమాండ్తో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ఆందోళనలు జరిగాయి. ఈ సందర్భంగా చేపట్టిన రిలే దీక్షా శిబిరాలను పోలీసులు పలుచోట్ల అడ్డుకున్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆధ్వర్యంలో ప్రభుత్వ ముద్రణాలయం సమీపంలో రోడ్డుకు దూరంగా ఉన్న బస్స్టాప్ వద్ద నిరాహార దీక్షకు కూర్చుంటే స్వయంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ఆ శిబిరంపై దాడి చేశారు. షామియానా తీసేయడంతోపాటు కోడిగుడ్లు, టమాటాలు, కుర్చీలతో దాడి చేశాడు. అంతే కాదు తమ పార్టీ నాయకులతో మూత్ర విసర్జన కూడా చేయించి తన వికృత చేష్టలను పరాకాష్టకు తీసుకువెళ్లారు. ఆందోళనలు చేసుకోవడానికి ధర్నా చౌక్ ఉండగా ఇక్కడ ఎందుకు చేస్తున్నారు? ఇక్కడ అనుమతి ఎలా ఇచ్చారంటూ పోలీసులను ఎమ్మెల్యే బొండా ఉమా నిలదీశారు. తర్వాత సింగ్నగర్లోని మల్లాది విష్ణు కార్యాలయం నుంచి పార్టీ శ్రేణులు నిరసన ర్యాలీ చేపట్టాయి. ఆసలు ఆఫీసు నుంచి మెయిన్ రోడ్డు మీదకు ర్యాలీ రాకుండా అడ్డుకోవడమే కాకుండా తప్పుడు ఫిర్యాదులు తీసుకుని పోలీసు కేసు కూడా నమోదు చేయించారు.
లోకేష్ పర్యటనలో వర్తించని నిబంధనలు
వైఎస్సార్ సీపీ చేపట్టిన రిలే దీక్షలు, ర్యాలీలను అడ్డుకున్న వ్యక్తులకు లోకేష్ పర్యటనలో నిబంధనలు గుర్తుకు రాలేదు. ఈ నెల 15వ తేదీన జెండా వందనం కార్యక్రమానికి మంత్రి నారా లోకేష్ వచ్చారు. ఆ సమయంలో టీడీపీ నాయకులు పాత ప్రభుత్వాస్పత్రి నుంచి సింగ్నగర్లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియం వరకూ భారీ ర్యాలీ నిర్వహించారు. స్వాతంత్య్ర దినోత్సవ స్ఫూర్తిని మరిచి సింగ్నగర్ ఫ్లై ఓవర్ నుంచి స్టేడియం వరకూ పసుపు రంగు బ్యానర్లతో నింపేశారు.
తాజాగా మహాత్మాగాంధీ రోడ్డులో తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఆదివారం డీఎస్సీ ఉపాధ్యాయులు ఆత్మగౌరవ ర్యాలీ నిర్వహించారు. వారికి టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్సీ ఎ.ఎస్.రామకృష్ణ, టీఎన్టీయూసీ రాష్ట్ర అధ్య క్షుడు గొట్టిముక్కల రఘు, టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొల్లగూర సాయి చరణ్, శాప్ డైరెక్టర్ సంతోష్ దగ్గరుండి వాటర్ బాటిళ్లు, భోజనాలు ఏర్పాట్లు చేశారు. జూలై ఎనిమిదో తేదీన ఇందిరాగాంధీ మునిసిపల్ కార్పొరేషన్ స్టేడియాన్ని ఆధునికీకరణ పనుల కోసం మూసి వేశారు. కనీసం వాకర్లను కూడా అనుమతించడం లేదు. అటువంటిది డీఎస్సీ ర్యాలీ కోసం స్టేడియంలో భారీగా షామియానాలు ఏర్పాటు చేశారు. వారికి అక్కడే భోజనాలు కూడా ఏర్పాటు చేశారు. బందర్ రోడ్డులో గంటకు పైగా ర్యాలీ పేరుతో ట్రాఫిక్ ఆపివేశారు. భారీగా ట్రాఫిక్ ఉండి హై కోర్టు న్యాయమూర్తులు, ఇతర ప్రముఖులు ప్రయాణించే రోడ్డులో ఇంత పెద్ద ర్యాలీకి పోలీసులు అనుమతులు ఎలా ఇచ్చారని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.


